బీజేపీలో వేరు కుంపట్లు.. కలిసి నడుస్తామంటూనే సొంతంగా ఆఫీసులు!

by Disha Web Desk 2 |
బీజేపీలో వేరు కుంపట్లు.. కలిసి నడుస్తామంటూనే సొంతంగా ఆఫీసులు!
X

దిశ, శేరిలింగంపల్లి: ఇక్కడి బీజేపీలో ఒక్కో నాయకుడిది ఒక్కో తీరు. పార్టీ శేరిలింగంపల్లి సెగ్మెంట్ లో ఎవరికి వారే అనే తీరుగా ఏంది. నేతలు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. గొడవలకు దిగుతున్నారు. తమకే టికెట్ అంటూ సొంత ప్రచారాలు చేసుకుంటున్నారు. ఆపై ఆఫీసులూ ప్రారంభించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా ప్రచార రథాలు కూడా తయారు చేసుకుని గల్లీల్లో చుట్టేస్తున్నారు. ఓ లీడర్ ఇంటింటికి బీజేపీ అంటే.. మరోనేత గడప గడపకూ కమలం అంటూ నియోజకవర్గ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నారు. మధ్యలో తామేం తక్కువ కాదంటూ మరో ముగ్గురు నేతలు ఐక్యతారాగం వినిపిస్తున్నారు. తామున్నామంటూ పార్టీ ఆఫీస్ ను ఓపెన్ చేసుకున్నారు. వీటన్నింటిని మాజీ ఎంపీ, పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి దగ్గరుండి మరీ ప్రారంభిస్తున్నారు.

తామేం తక్కువ

కమలం పార్టీలో లీడర్ అనుకునే ప్రతి నేత ఎమ్మెల్యే టికెట్ ఆశావహుడే. తామేం తక్కువ కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందరినీ కలుపుకునిపోయి పార్టీ పటిష్టతకు పని చేసే నేత మచ్చుకైనా లేడు. దీంతో పార్టీ సానుభూతిపరులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏకంగా కొందరు ప్రచార రథాలను కూడా రెడీ చేసుకోగా.. ఇంకొందరు ఆర్డర్లు కూడా ఇచ్చేశారట. ఎవరికి వారే తామే అభ్యర్థులమంటూ అన్నిరకాలుగా ఎన్నికలకు రెడీ అవుతుండడం ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.

పాదయాత్రలో అడ్డాకూలీలు

టికెట్ ఆశావహులు పలు రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నా పార్టీ కార్యకర్తలకంటే చాలావరకు పెయిడ్ కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఇటీవల ఓ నేత చేపట్టిన పాదయాత్రలో అడ్డా కూలీలు, వృద్ధులు, పిల్లలను ఎత్తుకుని ఇబ్బందులు పడుతున్న మహిళలే ఎక్కువగా కనిపించారు. అదేంటి అంటే ఎవరికి వారు పాదయాత్రలు చేస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారని, అడ్డా కూలీలు కాకుండా ఇంకెవరు వస్తారంటూ ఆయన అనుచరగణమే చెప్పుకోవడం నేతల తీరుకు అద్దం పడుతుంది. ఎక్కడ పాదయాత్ర ఉంటే అక్కడికి వచ్చేలా ముందే ఆయా నేతల అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఎన్నికలకు ముందే ఉపాధి దొరుకుతుండగా కష్టమైనా పాల్గొంటూ ఉపాధి పొందుతున్నారు అడ్డా కూలీలు.

రేసులో కొండా కూడా..

బీజేపీ నేతల వైఖరి పార్టీ పెద్దలకు, సీనియర్లకు కూడా తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇటీవల ఓ హోటల్ లో జరిగిన భేటీకి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. నియోజకవర్గ నేతలుందరూ పాల్గొనగా.. ఓ నేత వ్యవహార శైలిపై ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయనొక్కడిపైనే కాదు.. మరికొందరి తీరుపై కూడా పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. నియోజకవర్గ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను మాజీ ఎంపీ, పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి భుజాన వేసుకున్నారట. ఇందులో భాగంగానే నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరు పార్టీ ఆఫీసులు ప్రారంభించినా, మరొకటి చేసినా దగ్గరుండి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చివర్లో పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యే రేసులోకి కొండా వచ్చినా రావచ్చనేది కూడా చర్చలో ఉంది. లోకల్ లీడర్ల మధ్య ఉన్న అనిశ్చితికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పార్టీ పెద్దలు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రంగంలోకి దింపే చాన్స్ కూడా ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్, ఇతర బీజేపీ అనుబంధ సంఘాల కూడా ఆయన పేరునే తెరమీదకు తెస్తున్నట్లు సమాచారం.

Also Read:

కాంగ్రెస్‌లో విలీనం తర్వాత YS షర్మిలకు రాజ్యసభ!

Next Story

Most Viewed