హాట్ టాపిక్‌గా సిద్దిపేట.. హరీష్ రావును ఢీ కొట్టేలా జగ్గారెడ్డి సెన్సేషనల్ స్కెచ్!

by Disha Web Desk 2 |
హాట్ టాపిక్‌గా సిద్దిపేట.. హరీష్ రావును ఢీ కొట్టేలా జగ్గారెడ్డి సెన్సేషనల్ స్కెచ్!
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్దిపేట బరిలో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ జెగ్గారెడ్డి కూతురు జయారెడ్డి నిలవనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నది. జయారెడ్డిని సిద్దిపేట బరిలో నిలపాలని, తాము మీ వెంటే ఉంటామని సిద్దిపేట కాంగ్రెస్ కార్యకర్తలు జెగ్గారెడ్డిని కొద్ది రోజులుగా అభ్యర్థిస్తున్నారు. తన కూతురు జయారెడ్డి(కూచీ) సిద్దిపేటలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది..? ఏ విదంగా బరిలో దిగాలి అని జగ్గారెడ్డి అలోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. సిద్దిపేటలో జగ్గారెడ్డి కూతురు పోటీ అంశంపై రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిట్‌గా మారనున్నది.


మీ బిడ్డను బరిలో నిలపండి..

సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతిసారి ఎన్నికల్లో ఫలితాలు వన్ సైడ్ అవుతున్నాయి. కనీసం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన సంతృప్తి ఉండడం లేదు. ఈసారి మీ కూతురు జయారెడ్డిని సిద్దిపేట బరిలో నిలపండి. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేస్తామని సిద్దిపేటకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జెగ్గారెడ్డిని అభ్యర్థిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. ఊహించని అంశం తెరపైకి రావడంతో జెగ్గారెడ్డి కొంత ఆలోచనలో పడ్డారు. సిద్దిపేటలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బరిలోకి దిగితే ఎలా ముందుకు వెళ్లాలి..? అనే అంశంపై జెగ్గారెడ్డి సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.


ఆ ఎమ్మెల్సీ ఎన్నికతో తెరపైకి..

ఉమ్మడి మెదక్ జిల్లా లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సక్సెస్ కావడంతో సిద్దిపేట బరిలో జయారెడ్డి అంశం తెరపైకి వచ్చింది. 2021లో ఉమ్మడి మెదక్ జిల్లా లోకల్ బాడీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు అధికార బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నప్పటికీ ఓటమి తప్పదని తెలిసినప్పటికీ జగ్గారెడ్డి తన సతీమణి నిర్మలను(సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు) నిలిపిన విషయం తెలిసిందే. అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో జెడ్పీటీసీలు, ఎంపీటీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి సంబందించి నంత వరకు 230 మంది సభ్యులు ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల కంటే 9 ఓట్లు నిర్మలకు ఎక్కువ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే.

ఆ ఎన్నికతో జగ్గారెడ్డి సంచలనం..

2021లో ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతో జగ్గారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా క్లిక్ అయిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 230 ఓట్లు ఉన్నాయని అంతకు ఒక్క ఓటు తెచ్చుకుంటానని రాజకీయంగా శపథం చేశారు. జగ్గారెడ్డి శపథం అప్పట్లో పెద్ద సంచలసం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గారెడ్డి సతీమని నిర్మలకే ఓటు వేశారు. అయితే పార్టీ చెందిన ప్రజా ప్రతినిధులు 230 మాత్రమే ఉండగా అందుకు అదనంగా ఇతర పార్టీలకు చెందిన 9 మంది కూడా నిర్మలకు ఓటు వేయడం గమనార్హం.

జగ్గారెడ్డి అభిప్రాయ సేకరణ

సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో తన కూతురు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై జెగ్గారెడ్డి అన్ని పార్టీల నుంచి తనకు తెలిసిన వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. జయారెడ్డి పోటీ సిద్దిపేటలో బాగుంటుందని, సిద్దిపేట స్థానాన్ని ఏకగ్రీవంగా వదిలేయకుండా పోటీలో ఉంచడం గొప్ప విషయమని ఆయనతో సన్నిహితులు అంటున్నట్లు తెలిసింది. అయితే జగ్గారెడ్డి ఏ విధంగా ముందుకు అడుగులు వేయనున్నారు..? జయారెడ్డి సిద్దిపేట బరిలో ఉంటారా..? అనే అంశంపై వేచి చూడాల్సి ఉన్నది.


Next Story

Most Viewed