ఒక్క నియోజకవర్గం కోసం ముగ్గురు బడా నేతల మధ్య టఫ్ ఫైట్.. ‘హస్తం’ అండ ఎవరికి?

by GSrikanth |   ( Updated:2023-09-01 11:16:16.0  )
ఒక్క నియోజకవర్గం కోసం ముగ్గురు బడా నేతల మధ్య టఫ్ ఫైట్.. ‘హస్తం’ అండ ఎవరికి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో ఖమ్మం గుమ్మంలో ఏ పార్టీ జెండా ఎగరవేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ ఖమ్మంపైనే ఫోకస్ పెట్టాయి. ఈసారి బీఆర్ఎస్‌ను ఓడించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఖమ్మం జిల్లా నుంచే జయకేతనం ఎగుర వేయాలని చూస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన ముఖ్య నేతలను తమ వైపు ఆకర్షిస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది. ఇప్పటికే పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకున్న ఆ పార్టీ.. తాజాగా తుమ్మలకు గాలం వేసింది. ఇదే సమయంలో షర్మిల సైతం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారనే ప్రచారంతో ఈ జిల్లాలో టికెట్ల పంచాయితీ ఆసక్తిగా మారింది. అంతేకాదు.. ఈ ముగ్గురు కూడా పాలేరు టికెట్ ఆశిస్తుండటం గమనార్హం.

టికెట్ పోరులో రేసు గుర్రం ఎవరు?

ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాలేరు టికెట్ అంశం హాట్ టాపిక్ అవుతున్నది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అంతు చూస్తానంటూ పొంగులేటి సవాల్ చేయగా.. తనకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న తుమ్మల కందాల, కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఆయన పాలేరులో పోటీ ఖాయం అనే టాక్ వినిపి స్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్పీ అధ్యక్షురాలు షర్మిల సైతం పాలేరు టికెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఆమె ఇప్పటికే క్యాంప్ ఆఫీస్, ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. తన పార్టీని విలీనం చేయాలంటే పాలేరు టికెట్ తనకే కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.

పార్టీ మద్దతు ఎవరికి?

పాలేరు టికెట్‌పై ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా ఉంది. అందరి కంటే ముందే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్లో జోష్ పెంచింది తామే అని పొంగులేటి వర్గం చెబుతుంటే.. స్వయంగా పీసీసీతోపాటు ముఖ్య నేతలు ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో తుమ్మలకే టికెట్ ఖాయమని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఇక తమ పార్టీనే విలీనం చేస్తునందుకు పాలేరు టికెట్ తమ నేతకే వస్తుందని షర్మిల వర్గం లెక్కలు వేసుకుంటోంది. ఇదిలా ఉంటే షర్మిల విషయంలో టీకాంగ్రెస్‌లో అగ్రనేతల మద్దతు లభిస్తుండటం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story