BRSకు మరో కీలక నేత షాక్!

by Disha Web Desk 4 |
BRSకు మరో కీలక నేత షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గెలుపుపై దృష్టి పెట్టిన పార్టీలు తమ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుంటే, మరో వైపు రీబూస్ట్ అయ్యేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.

ఓ మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారడం ఖాయం అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బీఆర్ఎస్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఉద్యమకారులను జైల్లో పెట్టించిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఈ సారి మహేశ్వరం నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి తనకే టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం తనకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం లేదని ఓడిపోయినంత మాత్రాన తమను దూరం పెడతారా అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కనీస సమాచారం ఉండటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారికి తీసుకువచ్చి మంత్రులను చేస్తే తాము డమ్మీలుగా మారామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడ తప్పు చేయలేదు. ఎక్కడా భూములు కబ్జాలు చేయలేదు. అయినా తమను పార్టీ దూరంగా పెట్టడం అంటే మాలో ఏదో తప్పు ఉందని అధిష్టానం భావిస్తున్నదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సబితా ఇంద్రారెడ్డి మాకంటే గొప్పగా ఏం పని చేసిందో చెప్పాలన్నారు. అధిష్టానం తమతో సంప్రదిస్తే ఆలోచిస్తానన్నారు.

కాంగ్రెస్ వైపు తీగల చూపులు?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీలోని అసంతృప్తి నేతలు బహిరంగంగా కామెంట్స్ చేయడం అధినేత కేసీఆర్‌కు సమస్యగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో మహేశ్వరం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని కేసీఆర్ కారు పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చి ప్రాధాన్యత కల్పించారు. దాంతో అప్పటి నుండి నియోజకవర్గంలో సబితా వర్సెస్ తీగల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

ఈ క్రమంలో అనేక సందర్భాల్లో తీగల తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. అయితే ఈసారి సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీగల తన మనసు మార్చుకున్నట్లు తాజా వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ మారాలనే ఆలోచనతో ఉంటే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తిగా మారింది.

గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టిన నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తుండటంతో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మొత్తంగా మహాశ్వరం నియోజకవర్గంలో ఆధిపత్య పోరు తీగల కృష్ణారెడ్డిని కారులోనే కొనసాగేలా చేస్తుందా? లేక ‘తీగ’ తెగే వరకు తీసుకువెళ్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Next Story