కేసీఆర్ సర్కార్ ఒక తరాన్ని నాశనం చేసింది: కోదండరామ్

by Disha Web Desk 2 |
కేసీఆర్ సర్కార్ ఒక తరాన్ని నాశనం చేసింది: కోదండరామ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఒక తరాన్ని నాశనం చేసిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ప్రభుత్వం విద్యపై దృష్టి పెట్టలేదని, ఎక్సైజ్ శాఖపై దృష్టి కేంద్రీకరించిందని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో "ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి, ప్రైవేటు కార్పొరేట్ విద్యను నియంత్రించే అంశాలను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ఎజెండాలో చేర్చాలి" అని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. గ్రామాల్లో 8, 9 తరగతి పిల్లలు మద్యానికి బానిస అవుతున్నారని, మరి కొందరు గంజాయికి బానిస అవుతున్నారని, పెన్ను పేపర్ పట్టుకోవాల్సిన వయసులో బీరు బాటిళ్లు పట్టుకునే పరిస్థితి దాపరించిందంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత అధ్వానంగా మరిందో చూడొచ్చన్నారు.

పదేళ్ల కాలంలో అనేక ప్రభుత్వ పాఠశాలలను ముసివేశారని ఆరోపించారు. ఇది వరకు ప్రభుత్వ బడుల్లో టీచర్లు కావాలని హైకోర్టుకు విద్యార్థులు లేఖ రాస్తే అప్పడు హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అవ్వడంతో కొంత మందిని విద్యావాలంటీర్లను ప్రభుత్వం తీసుకుందని, అది ఈ తెలంగాణలో ఉన్న పరిస్థితి అని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సైతం 1200 మందికి గాను కేవలం 400 మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారని, అన్ని వర్సిటీలు కూడా ఇలానే దిగజారిపోయి ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో విద్యా పరిస్థితి అధ్వా్న్నంగా ఉందన్నారు. విద్యకు బడ్జెట్ నిధులు తక్కువగా కేటాయించారన్నారు. తెలంగాణలో ఉచిత విద్య కనీసం ఇంటర్ వరకు ఉండాలని, ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed