TS: ఎమ్మెల్యే అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నామినేషన్లు వేసిన వెంటనే రంగంలోకి!

by Disha Web Desk 2 |
TS: ఎమ్మెల్యే అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నామినేషన్లు వేసిన వెంటనే రంగంలోకి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్నిటికంటే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొన్ని లీగల్ ఇష్యూస్ సంకటంగా మారనున్నాయి. ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహాలను అరికట్టడం కోసం చర్యలు తీసుకుంటున్న ఎలక్షన్ కమిషన్ మొదటిసారిగా రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారాన్ని కూడా కోరుతున్నది. అభ్యర్థుల సంపద, ఆదాయం విషయంలో పారదర్శకత కోసం సరికొత్త విధానాన్ని అవలంబిస్తున్నది. మొట్టమొదటిసారి ఐటీ (ఆదాయపు పన్ను శాఖ) తరఫున ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. నామినేషన్‌తో పాటు సమర్పించే అఫిడవిట్‌లో ఆదాయం, అప్పులు, ఆస్తుల వివరాలను వెంటవెంటనే గత ఎన్నికల సందర్భంగా సమర్పించిన లెక్కలతో క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి ఐటీ టీమ్‌లు సన్నద్ధమవుతున్నాయి.

ఈ ఐదేండ్ల కాలంలో ఐటీ రిటన్స్ లో పేర్కొన్న లెక్కలతో పోల్చి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందనే మూలాలపై ఆరా తీయనున్నాయి. గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు సమర్పించిన ఐటీ రిటన్స్ లో ఈ ఆస్తుల్ని అభ్యర్థులు చూపించారో లేదో, దానికి సరిపోయేంత టాక్స్ ను చెల్లించారో లేదో టాలీ చేయనున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే వారికి నోటీసుల్ని జారీ చేయాలనే నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహదూర్ వెల్లడించారు. ఎన్నికల్లో ఆర్థిక అవకతవకలను నివారించడం, ఉల్లంఘనలకు పాల్పడినవారిపై దర్యాప్తు చేయడంలో భాగంగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఐటీ శాఖ దగ్గర ఉన్న డేటాను ఇప్పటికే అనాలిసిస్ చేసే తీరులో పార్మాట్‌ను సిద్ధం చేసుకున్నట్లు వివరించారు.

ఐటీ శాఖ తరఫున తెలంగాణలో మొత్తం 150 మంది గ్రూప్-1 ఆఫీసర్లను నియమించామని, ఇతర దర్యాప్తు సంస్థల నుంచి మరో 100 మందిని డిప్యూటేషన్‌పై నియమించుకున్నట్లు తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 8-9 మంది ఆఫీసర్లు ఐటీ తరఫున పర్యవేక్షణలో ఉంటారని, పోలింగ్ పూర్తయ్యేంతవరకూ 24 గంటలూ పనిచేసేలా మెకానిజంజను రెడీ చేసుకున్నట్లు తెలిపారు.గడచిన ఐదేండ్ల వ్యవధిలో అభ్యర్థులకు ఆస్తులు ఎలా సమకూరాయనేదానిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు ఆయన వివరించారు. కొత్తగా సమకూర్చుకున్న స్థిర, చరాస్తుల వివరాలను గతంలో సమర్పించిన ఐటీ రిటన్స్ లో పేర్కొన్నదీ లేనిది కూడా ఐటీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లు విశ్లేషించనున్నాయి.

ఆర్థిక వివరాల్లో తేడాలు దొర్లినట్లు తేలితే వెంటనే వారికి నోటీసులు జారీచేస్తామని, గరిష్ట స్థాయిలో ఆరు నెల్లలోనే వాటిని పరిష్కరించాలనుకున్నట్లు సంజయ్ బహదూర్ తెలిపారు. అభ్యర్థుల పాన్ నెంబర్ ఆధారంగా వారి బ్యాంకు లావాదేవీలను సైతం ఎప్పటికప్పుడు విశ్లేషించే వ్యవస్థను సిద్ధం చేసుకున్నామని, రిజర్వు బ్యాంకుతో పాటు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ నుంచి కూడా సహకారాన్ని ఇప్పటికే కోరామన్నారు. అనూహ్యంగా సంపద పెరిగినట్లయితే దానికి తగిన కారణాలను వారికి సంబంధించిన వివిధ రకాల డాక్యుమెంట్ల నుంచి పరిశీలిస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నదే ఇందుకోసమని ఒక ప్రశ్నకు సమాదానంగా చెప్పారు.

గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన పలువురు అభ్యర్థులు ఆదాయ, ఆస్తుల విషయంలో ఎలక్షన్ పిటిషన్‌ల రూపంలో న్యాయస్థానాల్లో కేసుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు దాఖలు చేసిన కేసులే. వీటికి తోడు ఈసారి ఆదాయపు పన్ను శాఖ నుంచే లెక్కల్లో తేడాలొస్తే నోటీసుల రూపంలో కొత్త చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసే ఖర్చు విషయంలో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కడికక్కడ షాడో అబ్జర్వర్లు ఐటీ శాఖ తరఫున పర్యవేక్షిస్తున్నందున పోలింగ్ పూర్తయిన తర్వాత నెల రోజులకు సమర్పించే రిపోర్టు విషయంలోనూ లెక్కల్లో తేడా వస్తే జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.



Next Story

Most Viewed