వినాయక చవిత వేళ రాజకీయ నేతలకు కొత్త తలనొప్పి!

by Disha Web Desk 2 |
వినాయక చవిత వేళ రాజకీయ నేతలకు కొత్త తలనొప్పి!
X

దిశ, కరీంనగర్​ బ్యూరో: ఎన్నికల వేళా రాజకీయ నాయకులకు చందాల గుబులు మొదలైంది. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దలతో వినాయకుడిని పూజించడానికి వాడవాడల మండపాలను ఏర్పాటు చేస్తున్నారు భక్తులు. ఈ ఏడాది రాష్ర్ట శాసనసభకు ఎన్నికలు జరుగుతుండడంతో నవరాత్రుల వేడుకలు కొందరు నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మండపాల నిర్వహణకు చందాల కోసం వస్తున్న వారికి చందాలు ఇవ్వడం మొదలు పెడితే నియోజకవర్గం మొత్తం ఇస్తే ఖర్చు తడిసి మొపేడు అయ్యేట్లు ఉంది. అలా అని ఇవ్వకుంటే ఎన్నికల సమయంలో బద్నాం అయ్యేటట్లు ఉన్నామని నేతలు తలలు పట్టుకుంటున్నారు.

స్వరం సిద్ధం...

తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దలతో నిర్వహించే గణపతి నవరాత్రులకు స్వరం సిద్దం చేస్తున్నారు భక్తులు. వాడవాడలో గణపతిని ప్రతిష్టించడానికి మండపాలను ముస్తాబు చేశారు. గణపతి నవరాత్రులు ఈ సారి నేతలకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టాయి. రాష్ర్ట శాసనసభకు ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం సిద్దం కాగా రాజకీయా పార్టీలు సైతం వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈలోపు గణపతి నవరాత్రులు రావడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ఇప్పుడు చందాల గుబులు పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేతల వద్ద మండల నిర్వహకులు ఈసారి ఎక్కువ మొత్తంలో చందా వస్తుందని ఆశిస్తున్నారు.

ఇస్తే తంటా.. ఇవ్వకుంటే బద్నాం..

గణపతి నవరాత్రులకు నేతలు తమకు అనుకులంగా ఉన్న కొన్ని మండపాలకు మాత్రమే చందాలు ఇచ్చే వారు. ఈ ఏడాది ఎన్నికలు ఉండడంతో వచ్చిన ప్రతి మండప నిర్వహకులకు చందాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రతి మండపానికి చందాలు ఇస్తే చందాలు మొత్తం ఎన్నికలకు ముందే తడిసి మోపేడు అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుందని భావించి చందాలు ఇవ్వకుంటే ఎన్నికల సమయంలో కనీసం చంద ఇవ్వలేదనే బద్నాం అయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Next Story

Most Viewed