తీన్మార్ మల్లన్నకు కీలక బాధ్యతలు.. రాష్ట్రమంతా వాడుకునేలా కాంగ్రెస్ ప్లాన్!

by Disha Web Desk 2 |
తీన్మార్ మల్లన్నకు కీలక బాధ్యతలు.. రాష్ట్రమంతా వాడుకునేలా కాంగ్రెస్ ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ తరఫున కొన్ని బాధ్యతలను తీన్మార్ మల్లన్నకు అప్పగిస్తూ నిర్ణయం జరిగింది. లాంఛనంగా పార్టీలో చేరడంతో రానున్న రోజుల్లో పలు నియోజకర్గాల్లోని బహిరంగసభల్లో ఆయన ప్రచారంలో యాక్టివ్ రోల్ పోషించనున్నారు. ప్రస్తుతం క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మధు యాష్కీ గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందున తీన్మార్ మల్లన్నను ఆ కమిటీకి కన్వీనర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తున్నట్లు కమిటీ చైర్మన్ మధు యాష్కీ తెలియజేయడంతో ఇక టూర్ షెడ్యూలును సంబంధిత పార్టీ వర్గాలు, నియోజకవర్గాల అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులతో మాట్లాడి ఖరారు చేసుకోవడమే తరువాయి.

నామినేషన్ల పర్వం పూర్తయిన వెంటనే క్యాంపెయిన్ యాక్టివిటీస్ కూడా వేగవంతం అయ్యేలా పార్టీ ప్లానింగ్ ఖరారైంది. ఎలాగూ రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ఈ నెల 15 తర్వాత తెలంగాణ మీదనే ఫోకస్ పెట్టి ప్రచారం చేయనున్నందున దానితో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర క్యాంపెయిన్ కమిటీ ప్రోగ్రామ్‌లను ఫైనల్ చేస్తుంది. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇది కొనసాగనున్నది. కొడంగల్, కామారెడ్డి సెగ్మెంట్లలో ఆయన పోటీ చేస్తున్నందున ఆ రెండింటిపై ఫోకస్ పెడుతూనే మరికొద్దిమంది అభ్యర్థుల ప్రచార సభల్లోనూ పాలుపంచుకోనున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తీన్మార్ మల్లన్న క్యాంపెయిన్ షెడ్యూలు ఫైనల్ కానున్నది.

తొలుత మేడ్చల్ నుంచి పోటీ చేయాలని తీన్మార్ మల్లన్న భావించినా సొంత పార్టీకి సంబంధించిన లీగల్ అంశాలు పూర్తికాకపోవడం, కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలన్న ప్లాన్‌లో మార్పులు చోటుచేసుకోవడంతో మొత్తం పార్టీ తరఫునే అభ్యర్థులను గెలిపించే క్యాంపెయినర్ బాధ్యతలను తీసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్‌కు అనుగుణంగా ఈ కొత్త టాస్క్ ను తీన్మార్ మల్లన్న నిర్వర్తించనున్నారు. బీఆర్ఎస్ పాలనపట్ల తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్న ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునేలా, వారి ఆలోచనలకు పదును పెట్టేలా, ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళే బాధ్యతలపై ఇక నుంచి ఫోకస్ పెట్టనున్నారు.


Next Story