తెలంగాణలో ఓట్ల వ్యాపారాన్ని అరికట్టండి

by Disha Web Desk 2 |
తెలంగాణలో ఓట్ల వ్యాపారాన్ని అరికట్టండి
X

దిశ, సిటీ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఓట్ల వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలని సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో కూడిన ''ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక'' ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నాయకులైన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కే. కోటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, వెంకటేశ్వర్లు తదితరులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలపై వీరితో సీఈఓ వికాస్ రాజ్ చర్చించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును అమ్ముకోకుండా చైతన్యం కలిగించేందుకు, అదేవిధంగా రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం ఇతర వస్తువులతో ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తమ వేదిక ద్వారా ప్రయత్నం చేస్తున్నామని, దీనికి ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా డబ్బు, మద్యం వంటివి పంపిణీ చేసినా, రవాణా చేసినా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఏ ఇతర పనులకు పాల్పడినా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

జర్నలిస్టులుగా మీరు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ద్వారా ఎన్నికలు సజావుగా జరిగేందుకు తమకు సహకరించడం, ఓటర్లను చైతన్యవంతం చేయడం అభినందనీయని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. అనంతరం వేదిక సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ముందు ముందు ఎన్నికలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను అపహస్యం చేసే విధంగా ఓట్ల వ్యాపారం నడుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతం చేసి ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగే అక్రమాలను ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి తీసుకురాచ్చని, లేదంటే ఎన్నికల కమీషన్ ఇచ్చిన సీ విజిల్, 1950 ఫోన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

డీజీపీని కలిసిన వేదిక ప్రతినిధులు

ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక సభ్యులు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అంజనీ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను జరుగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ద్వారా తాము ప్రజలను చైతన్యవంతం చేయడానికి చేస్తున్న కార్యక్రమాలకు పోలీసు యంత్రాంగం సహకరించాలని కోరారు. అందుకు డీజీపీ అంజనీ కుమార్ సానుకూలంగా స్పందించి వేదిక సభ్యులైన జర్నలిస్టు నేతలను అభినందించారు.


Next Story

Most Viewed