దీపావళి పండుగ వేళ ఫ్రీగా మద్యం, పటాకులు

by Disha Web Desk 2 |
దీపావళి పండుగ వేళ ఫ్రీగా మద్యం, పటాకులు
X

దిశ, గోదావరిఖని: దీపావళి పండుగ రానే వచ్చేది. ఆ పండుగ అంటేనే ఇంటింటా బాంబుల మూత మోగాల్సిందే. కార్మిక క్షేత్రమైన రామగుండంలో దీపావళి పండుగను కార్మికులు ఆనందంగా జరుపుకోవాలని సింగరేణి యాజమాన్యం దీపావళి బోనస్ కింద నెలనెలా కార్మికులకు భారీ ఆఫర్ ఇస్తుంది. ఇది పక్కన పెడితే.. మిగతా ప్రైవేట్ కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలకు బాంబుల కొనుగోలు ఆర్థికపరమైన సమస్యలు తెచ్చిపెడుతుంది. కానీ ఈ ఏడాది పటాకులు కొనుగోలు చేసేందుకు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అసలే ఎన్నికల వేళ... ఓటర్లను ఏవిధంగా మచ్చిక చేసుకోవాలో అని పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు పడరాని కష్టాలు పడుతుంటారు. ఈ దీపావళి పండుగ అభ్యర్థులకు కొంత కలిసి వచ్చింది.

ఎందుకంటారా..? బయట మార్కెట్‌లో పటాకాలు కొనుగోలు చేయాలంటే కిలో రూ.500 చొప్పున ధరలు మండుతున్నాయి. దీన్ని పసిగట్టిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు తమ డివిజన్ల పరిధిలోని ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పటాకులను గాలం వేస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో గత రెండు రోజులు నుంచి ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులకు సంబంధించిన ముఖ్య అనుచరులు తమకు అనుకూలమైన ఓటర్లను గుర్తించి వారికి నేరుగా బాంబులను నజరానాగా అందిస్తామని ముందే మాట తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒక కుటుంబానికి ఫ్యామిలీ ప్యాకేజీ కింద బాంబులు పంపిస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారులు తీవ్రంగా నిఘా పెంచడంతో అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ముందుగా మద్యం షాపుల వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకొని టోకెన్ పద్ధతిలో తమ ఓటర్లు వస్తే ఉచితంగా మద్యం కూడా ఇవ్వాలని టోకెన్ సిస్టంకు తెరలేపినట్లు సమాచారం.



Next Story

Most Viewed