‘ఈసారి వచ్చేది కాంగ్రెస్సే.. బీఆర్ఎస్ గెలుసుడు కష్టమే’

by Disha Web Desk 2 |
‘ఈసారి వచ్చేది కాంగ్రెస్సే.. బీఆర్ఎస్ గెలుసుడు కష్టమే’
X

‘ఈసారి వచ్చేది కాంగ్రెస్సే..’ ‘బీఆర్ఎస్ గెలుసుడు కష్టమే..’ ఈ కామెంట్లన్నీ దసరాకు పల్లెలకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఎక్కడో ఓ చోట వినిపించినవే. అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్​మీడియాలో వస్తున్న పోస్టుల కంటే ఎక్కువగా పల్లెవాసులు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ అంశంపైనే అధికార పార్టీకి బెంగ పట్టుకున్నది. ఆ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకు అయిన గ్రామాలు, వృద్ధ ఓటర్లపై ఈ ప్రభావం పడితే పరిస్థితి ఏంటని భావిస్తున్నది. రానున్న రోజుల్లో ఈ మౌత్​ టాక్​ ఇలాగే కొనసాగితే పార్టీకి భారీ నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నది. దీనిని ఎదుర్కొనేందుకు కుల, మహిళా సంఘాలతో సమావేశమై.. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రైతుబంధు, కరెంటు ఆపేస్తారని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నది. మొత్తంగా ప్రచారాన్ని హీటెక్కించాలని బీఆర్​ఎస్​ నాయకత్వం శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌కు పట్టు ఉన్న పల్లెల్లో ఎదురుగాలులు వీస్తున్నాయి. కొన్ని రోజులుగా గ్రామాల్లో “వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుదట కదా?’’ అనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఈ మధ్య అది మరింత ఎక్కువైంది. రానున్న రోజుల్లో కూడా ఇదే టాక్ ఇలాగే కొనసాగితే ప్రమాదం తప్పదని గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తున్నది. అందుకు ప్రతిగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఊపందకుంటున్న మౌత్ పబ్లిసిటీ

కొన్ని రోజులుగా గ్రామాల్లో కాంగ్రెస్‌పై పాజిటివ్ చర్చ జరుగుతున్నది. వచ్చేసారి కాంగ్రెస్ పవర్ లోకి వస్తుందట కదా? నిజమేనా అని టాక్ ఉంది. ఈ చర్చ సోనియా గాంధీ రాష్ట్ర పర్యటన తరువాత మొదలై రాహుల్, ప్రియాంక టూర్ తరువాత మరింత ఊపందుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పై ప్రజల్లో సానుకూలత ఏర్పడటానికి తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరే అందుకు కారణమని విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేల బంధువులు, అనుచరుల భూ దందాలు, బెదిరింపులు, స్థానికంగా వారు చేసే హడావుడిపై ప్రజలు విసిగిపోయారనే టాక్ ఉంది. అలాగే సీఎం కేసీఆర్ పై ప్రజల్లో కాస్త ఆదరణ తగ్గిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

మేనిఫెస్టో ప్రచారంలో విఫలం

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీస్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆకర్శితులవుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించి, గులాబీ పార్టీని అలర్ట్ చేసినట్టు ప్రచారం ఉంది. అందుకే పులి బయటికి వస్తుంది. అదిరిపోయే హామీలు ఇస్తుంది..’ అని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌‌ పబ్లిక్ మీటింగ్ లో ప్రస్తావించారని టాక్ ఉంది. అలాగే మంత్రి హరీశ్ రావు సైతం అదిరిపోయే మేనిఫెస్టో ఉంటుందని పదే పదే చెప్పారు. కానీ, కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత ప్రజల స్పందన చూసి బీఆర్ఎస్ లీడర్లే షాక్ గురైనట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ హామీలను ఢీ కొట్టే స్థాయిలో బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉన్నా, రుణమాఫీ, దళిత బంధు, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్, బీసీ సాయం స్కీమ్ లకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది. ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులను నిలదీస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయడంలో విఫలం అయ్యారని అభిప్రాయాలు నెలకొన్నాయి.

మౌత్​టాక్ ప్రమాదం

ఎన్నికల సమయంలో పార్టీలు చేసే ప్రచారాల కంటే, జనాల మధ్య జరిగే చర్చ, అందులో మౌత్ పబ్లిసిటీ చాలా ఎఫెక్ట్ చూపుతుంటుదని పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రజల మధ్య జరిగే ఆ చర్చను పక్కదారి పట్టించడం అంత ఈజీ కాదని విశ్లేషిస్తున్నారు. అందుకు ఈ మధ్య కర్ణాటక స్టేట్ అసెంబ్లీ ఎన్నికలే అందుకు నిదర్శనం అని అంటున్నారు. అక్కడ ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పట్నించే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూల చర్చ మొదలైంది. దాన్ని అడ్డుకునేందుకు పీఎం మోడీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయిందని గుర్తు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా కొన్ని రోజులగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్ టాక్ మొదలైంది. సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ లీడర్లు పెద్దగా ప్రచారం చేయకున్నా, ప్రజలమధ్య మాత్రం పెద్ద స్థాయిలో చర్చ జరిగిందని అభిప్రాయాలు ఉన్నాయి.

Next Story

Most Viewed