అర్ధరాత్రి అచ్చంపేటలో హై డ్రామా.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలు

by Disha Web Desk 2 |
అర్ధరాత్రి అచ్చంపేటలో హై డ్రామా.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలు
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో శనివారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అచ్చంపేట అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు చెందిన వాహనంలో డబ్బులు పంచే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందడంతో.. శనివారం రాత్రి 11 గంటల సమయములో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు అచ్చంపేట మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో వాహనాన్ని అడ్డుకున్నారు. దీనితో కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే సమయంలో ఉప్పునుంతల మండలంలో ప్రచారం ముగించుకొని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ సైతం అక్కడికి వచ్చారు.

ఇరువు వర్గాల మధ్య ఘర్షణ పతాక స్థాయికి చేరుకొని రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో కొంతమందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మెడకు గాయాలు అయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని హుటాహుటిన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. దీనితో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా కూడలిలోనూ, పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనలు చేశాయి.

అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను అరెస్టు చేయాలని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేయగా, గువ్వల బాలరాజు తమపై దాడి చేసి గాయపరిచారని అతడిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఓటమి భయంతో అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కొత్త నాటకానికి తెర లేపారని వంశీకృష్ణ ఆరోపిస్తుండగా, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు తీవ్ర గాయాలు అయ్యాయని అధికార పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఏది నిజం.. ఏది అబద్దం అన్న విషయం తెలియవలసి ఉంది. ఏది ఏమైనా ఈ సంఘటన రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతోంది.

Next Story

Most Viewed