అఖిలపక్ష పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ.. అభ్యంతరాలకు పరిష్కారం దక్కేనా?

by Disha Web Desk 2 |
అఖిలపక్ష పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ.. అభ్యంతరాలకు పరిష్కారం దక్కేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం అవుతున్నది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించబోతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఈ టీమ్ వరుస సమావేశాలతో బిజి బిజీగా గడపనుంది. తొలిరోజు పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఆయా పార్టీలు తమ అభ్యంతారాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల వేళ ఏ పార్టీ ఎటువంటి ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు తీసుకువెళ్తుందో అనేది ఉత్కంఠగా మారింది.

బీఆర్ఎస్‌కు గుర్తు గుబులు:

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల గుర్తు పెద్ద టెన్షన్‌గా మారింది. ఇతర రాజకీయ పార్టీలకు కారు గుర్తును పోలి ఉండే సింబల్స్ కేటాయిస్తుండటంతో ఇప్పటికే ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కారును పోలిన సింబల్స్ గతంలో బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టిన నేపథ్యంలో కారును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించవద్దని ఇప్పటికే ఎన్నికల సంఘానికి గులాబీ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఇవాళ్టి మీటింగ్ లోనూ ఈ అంశం అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.

ఫ్యామిలీ ఓట్లు చెల్లాచెదురు చేశారు: బీజేపీ

తెలంగాణలో ఓట్లను చెల్లాచెదురు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. అర్బన్ ఏరియాలో ఒకే కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కొక్కరి ఓటును ఒక్కో పోలింగ్ బూత్‌లలో ఎన్ రోల్ చేశారని ఇలా దాదాపు 43 నియోజకవర్గాల్లో సుమారు 77 లక్షల ఓట్లు చెల్లాచెదురుగా చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నాదు. దాంతో పాటు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారని రాష్ట్ర అధికారులే ఈ దొంగ ఓట్ల నమోదుకు సహకరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయగా ఇవాళ్టి మీటింగ్‌లో ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని తెలుస్తోంది.

ఓటర్ లిస్ట్ మార్చడానికి ప్రయత్నాలు: కాంగ్రెస్

తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన అసెంబ్లీ, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తోంది. ఇండ్లు లేకపోయినా ఓట్లు ఉన్నాయని చనిపోయిన వారి పేర్లు లిస్టులో కొనసాగతున్నాయని ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల ఒత్తిడితోనే నకిలీ ఓటర్లను తొలిగించడం లేదని కాంగ్రెస్ మండిపడుతోంది. దీంతో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్‌లో పార్టీలు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తబోతున్నాయి. వాటికి అధికారులు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

Next Story

Most Viewed