కేసీఆర్‌కు క్షుద్రపూజలు వచ్చు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కేసీఆర్‌కు క్షుద్రపూజలు వచ్చు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఘట్కేసర్ వీబీఐటీలో శుక్రవారం నిర్వహించిన స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉండటం సరికాదని సూచనలు చేశారు. ప్రతి ఒక్క కార్యకర్తలో ప్రధాని మోడీ ఆవహించాలని వ్యాఖ్యానించారు. టిక్కెట్లు వచ్చినా.. రాకున్నా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పోరాడాలని కోరారు. పొరపాటున కేసీఆర్ మళ్లీ సీఎం అయితే తెలంగాణ మరో శ్రీలంకలా మారే ప్రమాదముందని హెచ్చరించారు. దారుస్సలాం ముందు దేహీ అని బెదిరించే దుస్థితి ఏర్పడుతుందన్నారు. కేసీఆర్‌కు హిందువుల దమ్మేంటో చూపించాలని సంజయ్ పిలుపునిచ్చారు. మహమూద్ అలీ హోంమంత్రిగా ఉండటానికి అనర్హుడని, సిగ్గు లేకుండా పోలీస్ చెంప పగులగొడతాడా? అని విమర్శించారు. కాంగ్రెస్ ఢిల్లీలో కాదు కదా గల్లీలో కూడా లేదని ఎద్దేవాచేశారు. ఒక సెక్షన్ మీడియా కాంగ్రెస్ గ్రాఫ్‌ పెంచేందుకు ప్రయత్నిస్తోందని, బీజేపీని దెబ్బతీసేందుకు కేసీఆరే కాంగ్రెస్ గ్రాఫ్‌ను పెంచే కుట్ర చేస్తున్నాడని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడటం లేదని టెన్షన్ పడుతున్నారని, కానీ ఆయన చుక్క ముక్క వేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడని బండి అన్నారు. కేసీఆర్ సడ్డకుడి కొడుకును ఇంటికి రానీయడం లేదని, కేసీఆర్ కుటుంబంలో లొల్లి మొదలైందని, కుటుంబ పాలనతో దేశానికి ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. మోడీ చెప్పింది అక్షరాల నిజమని, కేసీఆర్ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతాడని మండిపడ్డారు. కొడుకు సీఎం చేయాలనుకున్నడు. హరీష్ రావు అలిగాడని, కవిత ఇంట్లోనే మకాం వేయడంతో సీఎంను చేసే నిర్ణయాన్ని కేసీఆర్ వాయిదా వేశారన్నారు. సీఎం బయటకు రాక నెలరోజులైందని, ఇతరుల నాశనాన్ని కోరుకునే వ్యక్తి అని, అందుకే క్షుద్ర పూజలు చేస్తాడని బండి పేర్కొన్నారు. అందుకే అవన్నీ తిరిగి ఆయనకే తగిలాయని, పేదల పాపం ఊరికే పోదని బండి హెచ్చరించారు.



Next Story

Most Viewed