రజాకార్ మూవీ టీజర్‌పై కేటీఆర్ రియాక్షన్.. ‘బండి’ కౌంటర్!

by GSrikanth |
రజాకార్ మూవీ టీజర్‌పై కేటీఆర్ రియాక్షన్.. ‘బండి’ కౌంటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ మూవీ పొలిటికల్ కాంట్రవర్సీగా మారుతున్నది. ఎన్నికల వేళ ఈ మూవీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను మూవీ మేకర్స్ విడుదల చేయగా దీనిపై మంత్రి కేటీఆర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మధ్య ట్విట్టర్ (ఎక్స్) వార్ మొదలైంది. రజాకార్ మూవీ టీజర్ సమాజంలోని కమ్యూనిటీస్ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని అందువల్ల ఈ సినిమా రిలీజ్ ను ఆపడం ద్వారా శాంతిభద్రతలను కాపాడాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సీఎం, కేటీఆర్, బీఆర్ఎస్ ట్విట్టర్ అకౌంట్లకు ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ పై రియాక్ట్ అయిన కేటీఆర్ 'రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బీజేపీకి చెందిన కొంతమంది మేధావులు దివాళా తీసిన జోకర్లు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. తెలంగాణ శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు తెలంగాణ పోలీసులతో కూడా మేము ఈ విషయాన్ని తీసుకుంటాం' అని ట్వీట్ చేశాడు.

ఇది కేవలం ట్రైలర్ మాత్రమే బండి కౌంటర్:

కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ కౌంటర్ వేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని తొలుత వాగ్దానం చేసిన వారు ఇప్పుడు ట్రాక్ మార్చారని తాజాగా రజాకార్ల వాస్తవాలను చూపించినప్పుడు ట్విట్టర్ టిల్లు (ఎక్స్ టిల్లు)కు ప్రాబ్లెమ్ గా ఉందని మండిపడ్డారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని సెటైర్ వేశారు. హిందువుల పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పలేదు కానీ రజాకార్ల హిందూ మారణహోమాన్ని చూపించిన సినిమాపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడని ఎద్దేవా చేశారు. చరిత్రను తుడిచిపెట్టే పనికిమాలిన ప్రయత్నాలకు బదులు ఎక్స్ టిల్లుకు కొంత స్పృహను కలిగించమని అందరం గణేశుడిని ప్రార్థిద్దాం అంటూ కౌంటర్ వేశారు.

ఎన్నికల వేళ ‘రజాకార్’ కాంట్రవర్సీ:

‘రజాకార్ -ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ సినిమా మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా అనౌన్స్ నాటి నుంచి టీజర్ వరకు అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తమను టార్గెట్‌ చేసే ఈ సినిమా తీశారని ఓ వర్గం పెద్దలు ఆరోపిస్తుంటే నిజాం పరిపాలన నాటి వాస్తవాలను మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నామని మూవీ యూనిట్ చెబుతున్నది. గత జూలైలో ఈ సినిమా పోస్టర్‌ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, తదితరులు ఆవిష్కరించినప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాగా తాజాగా టీజర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతలో టీజర్ విషయంలో మంత్రి కేటీఆర్ ఏకంగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించడంతో సినిమా దుమారం రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపనుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

Next Story