బీజేపీని రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనివ్వం: CPIM

by Disha Web Desk 2 |
బీజేపీని రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనివ్వం: CPIM
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని, సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులను ఆదరించి, ఎన్నికల్లో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో మూడు స్థానాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తగిన విధంగా కృషి చేస్తామని, వారి ప్రయోజనాలు కాపాడే విధంగా పోరాడుతామని ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చినట్టు వివరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నినాదాలతో సీపీఐ(ఎం) ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకుపోతుందని చెప్పారు. 1. మొదటిది సీపీఎం అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఇవ్వండి. 2. వామపక్ష అభ్యర్థులను బలపర్చాలి. 3. బీజేపీని రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవకుండా నిలవరించాలి. అనే అంశాలతో ముందుకెళతామన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఆ పార్టీ చెప్పినట్టు అధికారంలోకి వచ్చే పరిస్థితి ప్రస్తుతం లేకపోయినప్పటికీ, గెలవగలిగే రెండు మూడు స్థానాల్లోనైనా.. ఆ పార్టీని గెలవకుండా చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. బీజేపీ భావాజాలాన్ని ప్రజల మనుసుల్లోనుంచి తొలగించేందుకు వివిధ రూపాల్లో ప్రచారం.. నిర్వహిస్తామన్నారు.

పొత్తుల విషయంలో స్పష్టత లేదు:

పొత్తుల విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. వారు ఇస్తామన్న సీటు కూడా ఇవ్వకుండా దాటవేస్తున్నారన్నారు. ఒక్కో సీటు ఇస్తామనీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్టుగా సీపీఐ ద్వారా తెలిసిందన్నారు. పెద్దలు జానారెడ్డి కూడా ఫోన్ చేశారన్నారు. అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి పోయేందుకు సిద్దమవుతున్నారని తమ్మినేని చెప్పారు.


Next Story

Most Viewed