చేనేతకు జీరో జీఎస్టీ వేయాలి.. గ్లోబల్ పద్మశాలి సమ్మిట్‌లో తీర్మానం

by Disha Web Desk 2 |
చేనేతకు జీరో జీఎస్టీ వేయాలి.. గ్లోబల్ పద్మశాలి సమ్మిట్‌లో తీర్మానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా చేనేత వస్త్రాలు, ఉత్పత్తులకు జీఎస్టీని రద్దు చేయాలని, జీరోగా చేయాలని గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ కోరింది. ఈ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నదని గుర్తు చేసింది. సోమవారం గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ దుబాయ్‌లో జరిగింది. ఈ సమ్మిట్‌కి 12 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. చేనేతకు ఒక గొప్ప చరిత్ర ఉందని, స్వాతంత్ర ఉద్యమంలో చరఖా అహింసాహిత చిహ్నంగా నిలిచింది. 2017లో తొలిసారిగా భారత ప్రభుత్వం చేనేతపై ఐదు శాతం జీఎస్టీ విధించిందని ప్రతినిధులు మండిపడ్డారు. దీనిని తొలగించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో చేస్తున్న జీరో జీఎస్టీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాజకీయ పార్టీలు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు.

గ్లోబల్ సమ్మిట్‌లో గౌరవ అతిథిగా పాల్గొన్న జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత చేనేతపై విధించిన జీఎస్టీని తొలగించాలని గ్లోబల్ సమ్మిట్లో భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ కూడా ఆమోదించారు. చేనేతను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఎమ్మెల్సీ ఎల్.రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవులు, తెలంగాణ పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, కోశాధికారి కోక్కుల దేవేందర్, ఇంజనీర్స్ విభాగం అధ్యక్షులు పుట్టా పాండురంగయ్య లు మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యంగా ఉండవలసిన అవసరాన్ని వివరించారు. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ మాట్లాడుతూ.. పద్మశాలీ పితామహులు, జాతీయోద్యమ నాయకులు, సమ సమాజస్థాపన, సామాజిక తెలంగాణ శ్వాప్నికులు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రజాబంధు ప్రగడ కోటయ్య ఆశయాల సాధనకు కలిసి రావాల్సిందిగా కోరారు.


తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో రాజకీయ, సామాజిక మార్పుకు నాంది కావాల్సిందిగా ప్రవాస భారతీయ పద్మశాలీ సోదరులను ఆహ్వానించారు. సమావేశంలో గ్లోబల్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు మరియు అమెరికా కెనడా, ఆస్ట్రేలియా, యూకే, దుబాయ్, ఇండియా ఇంచార్జ్ సభ్యులు పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షులు బొల్లా శివశంకర్, మీడియా విభాగం అధ్యక్షులు ఆవ్వారి భాస్కర్, నక్క వేణుమాధవన్, సంకు సుధాకర్, ఈడం శ్రీనివాస్, బాసాని పద్మ, విశ్వ రేఖ, చిప్ప విజయలక్ష్మి, రాపోలు సుధాకర్, కోమటి సత్యనారాయణ, వేణు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో నూతనంగా గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్ ఆవిర్భవించింది. గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్ లక్ష్యాలను హరి ఇప్పనపల్లి, బాలాజీ జిల్లా, ప్రదీప్ సామల వివరించారు. దుబాయ్ చాప్టర్ నిర్వాహకులు పిల్లలమర్రి ప్రమోద్, గుత్తికొండ రవిచంద్ర, శరత్ చంద్ర, విజయ్ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయపరచారు.


Next Story