గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలి.. వైఎస్ షర్మిల

by Dishafeatures2 |
Ys sharmila Political party name
X

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదాకు 5 లక్షల మంది అభ్యర్థులు పట్టుబడుతున్నా.. దొరకు నిద్ర మత్తు వదలడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా కంటికి కనిపించడం లేదని, పరీక్షలు మరో 3 నెలలు వాయిదా వేయాలని ఎవరెంత మొత్తుకున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ నియంత పోకడకు ఇది నిదర్శనమని చెప్పారు. తొమ్మిదేండ్లుగా ఉద్యోగాల భర్తీ పక్కన పెట్టి నిరుద్యోగులను ఉరికంభం ఎక్కించారన్న షర్మిల.. ఇంటికో కొలువు ఇస్తానంటే నమ్మినందుకు తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొలువులు ఇయ్యండని రోడ్డు మీదికి వచ్చిన లక్షలాది మందిపై లాఠీలు ఝులిపించారని, ప్రశ్నించిన నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. అంగట్లో ప్రశ్నాపత్రాలు అమ్ముకొని నిరుద్యోగుల కడుపుల్లో మట్టి కొట్టారని ఆమె.. టీఎస్పీఎస్సీ బోర్డును భ్రష్టు పట్టించింది చాలదన్నట్లు ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం హడావిడిగా బలవంతపు పరీక్షలు పెడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల ఆశయాలను శాశ్వతంగా సమాధి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కేసీఆర్ తన దుర్మార్గపు ఆలోచన మానుకొని నిరుద్యోగులు కోరుతున్నట్లు గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. లేకుంటే బంధిపోట్ల రాష్ట్ర సమితిని నిరుద్యోగులే బొంద పెడతారని, ప్రగతిభవన్ గడీలను బద్దలు కొట్టి రోడ్డుపైకి ఈడుస్తారని అన్నారు.



Next Story

Most Viewed