సీఎం కేసీఆర్‌పై YS షర్మిల ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
సీఎం కేసీఆర్‌పై YS షర్మిల ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఎంప్లాయ్‌మెంట్ పాలసీ తీసుకురావాలంటున్న మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని వైఎస్ఆర్టీపీ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా సోమవారం తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలకు డిజిటల్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఐటీ మంత్రిగా మీ వైఫల్యం కాదా? అని నిలదీశారు. యువతను బలిపశువులను చేసింది సీఎం కేసీఆర్ అని, అదే యువత ఉద్యోగ ఆకాంక్షలను పాతరేసింది కేటీఆర్ అని పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షలు రాయొద్దని, ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.

తొమ్మిదేళ్లుగా ఒక్క గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ కాదా? అని పేర్కొన్నారు. కొలువులు ఇవ్వకుండా వందలాది మంది నిరుద్యోగుల ఉసురుతీసిన ఘనత కేసీఆర్‌ది కాదా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న ఒక కుటుంబాన్ని అయినా పరామర్శించారా? అని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ యువతను వంచించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్‌కు సిగ్గుంటే ముక్కునేలకు రాసి, యువతకు క్షమాపణ చెప్పాలన్నారు. లక్షా 91 వేల ఖాళీలకు నోటిఫికేషన్‌లు ఇచ్చి, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed