ఈసారి ఓటు కోసం కాలు బయటపెట్టి చూడు.. కేసీఆర్‌కు షర్మిల సూచన

by Disha Web Desk 2 |
ఈసారి ఓటు కోసం కాలు బయటపెట్టి చూడు.. కేసీఆర్‌కు షర్మిల సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈసారి జరిగే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు, ఆయన కుమారుడు కేసీఆర్‌కు రోకలిబండే సమాధానం చెబుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. కామారెడ్డిలోని పిట్లంలో మంత్రి కేటీఆర్ పిట్టకథలు చెప్పి వచ్చాడని, అసలు తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరో ఆ పిట్టల దొర కొడుక్కి తెలియదా? అని ఆమె చురకలంటించారు. తెలంగాణలో 33 ప్రాజెక్టులు కట్టి బీడు భూములకు నీరు పారించిన తన తండ్రి వైఎస్సార్.. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపినట్టవుతుందా? అని ఆమె ప్రశ్నించారు. రుణమాఫీ, ఉచిత కరెంట్, సబ్సిడీ పథకాలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు తెలంగాణను కొట్టి చంపినట్టా? అని ఆమె నిలదీశారు. ఆరోగ్యశ్రీ, పక్కా ఇండ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, లక్షల కొద్దీ సర్కార్ ఉద్యోగాల భర్తీ ఇవన్నీ ప్రజలను కొట్టి చంపినట్లేనా? అని ఆమె ఫైరయ్యారు. నిజానికి తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపుతున్నది నీ అయ్య ‘కసాయి రావే’నని షర్మిల విమర్శలు చేశారు.

మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేవలం ఒక్క కుటుంబం కోసం నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా? అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపంచారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను, రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? అని షర్మిల నిలదీశారు. ఫీజులు చెల్లించక విద్యార్థులను, పోడుపట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది కసాయిరావు కాదా అని విమర్శించారు. ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే తెలంగాణను దర్జాగా దోచుకుంటున్న దొంగలు కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు కాజేసి, అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది కల్వకుంట్ల కుటుంబమేనని మండిపడ్డారు. తల్లిలాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గూండాలు కేసీఆర్ కుటుంబమేనని షర్మిల ఘాటు విమర్శలు చేశారు.


Next Story

Most Viewed