నేటినుంచి మళ్లీ రంగంలోకి YS షర్మిల.. అక్కడినుంచే ప్రారంభం!

by Disha Web Desk 2 |
నేటినుంచి మళ్లీ రంగంలోకి YS షర్మిల.. అక్కడినుంచే ప్రారంభం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తన ప్రజా ప్రస్థాన పాదయాత్రను ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈనెల 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు షర్మిల 3500 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించింది. నర్సంపేటలో టీఆర్ఎస్ నేతలు ఆమె క్యారవాన్, ఇతర వాహనాలను ధ్వంసం చేయడం, నేతలపై దాడి కారణంగా పోలీసులు ఇబ్బందులు తలెత్తొద్దని ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఎక్కడైతే పాదయాత్రను అడ్డుకున్నారో అక్కడి నుంచే ప్రారంభించాలని షర్మిల నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఆమె యాత్రకు హైకోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ పాదయాత్ర అడ్డుకున్న చోటు నుంచే ప్రారంభించాలనుకోవడంతో శాంతిభద్రతల పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వరంగల్ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదని సమాచారం. రూట్ మార్చుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, వైఎస్సార్ టీపీ నేతలు మాత్రం కోర్టు ఆదేశాలకనుగుణంగా యాత్రకు అనుమతించాలని వరంగల్ సీపీ కార్యాలయం వద్ద డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయల్దేరి 11 గంటల వరకు నర్సంపేటలోని లింగగిరి నుంచి షర్మిల తన పాదయాత్రను ప్రారంభించాలని డిసైడయ్యారు. ఇదిలా ఉండగా పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.



Next Story

Most Viewed