కేసీఆర్, ఆయన ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయం: YS షర్మిల తీవ్ర విమర్శలు

by Disha Web Desk 19 |
కేసీఆర్, ఆయన ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయం: YS షర్మిల తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన బిడ్డ కవిత జైలుకు పోయే సమయం వచ్చేసరికి కేసీఆర్‌కు కార్యకర్తలు గుర్తుకు వచ్చారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఇన్నాళ్లు ఎవడు చస్తే నాకేంటని విద్యార్థులు, రైతులు, ఉద్యమకారులు, వెంట నడిచిన వారిని వెన్నంటి ఉన్న వారిని వెన్నుపోటు పొడిచిన కేసీఆర్‌కు ఇన్నాళ్లకు కార్యకర్తలు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు. కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాసిన లేఖపై షర్మిల ఘాటుగా స్పందించారు. లిక్కర్ మరకల్లో బిడ్డ జైలుకు పోతుందని, పేపర్ లీకేజీ వ్యవహారం అధికార శాపం అవుతుందని, ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఈ తరహా ఎత్తుగడలు వేస్తున్నావా అని ప్రశ్నించారు.

రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, ఉద్యమకారులకు అన్యాయం జరిగినప్పుడు మీ పార్టీ సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఒక్కనాడైనా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఏ ఒక్కరికైనా లెటర్ రాశారా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని కార్యకర్తలు, కార్యకర్తల బలం, తెలంగాణ ఉద్యమం లిక్కర్ స్కాంలో తన బిడ్డకు ఇబ్బందులు వచ్చేసరికి గుర్తుకు వచ్చిందని విమర్శించారు. ఆత్మీయ సందేశం పేరుతో కేసీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, నువ్వు ఎన్ని లెటర్లు రాసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా నీ పాపం పండిందని రేపు ఎన్నికల్లో నీ పాపానికి పరిహారం చెల్లించుకోక తప్పదన్నారు. నీవు నీ ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయం అన్నారు.



Next Story