'కొంచెం అయినా సిగ్గు అనిపించడం లేదా కేటీఆర్?'

by Disha Web Desk 2 |
కొంచెం అయినా సిగ్గు అనిపించడం లేదా కేటీఆర్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం అప్పగించి పరిపాలించమంటే ఏడేళ్లుగా రాష్ట్రాన్ని పట్టించుకోని సీఎం కేసీఆర్ ఢిల్లీలో కూతురిని కాపాడుకునేందుకు బీజేపీని బతిమిలాడుకుంటున్నాడని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వారం రోజుల పాటు పరిపాలనను వదిలేసి సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి వస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో ఓట్లు కొనడానికి వెళ్లారని ధ్వజమెత్తారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడో, నిరుద్యోగులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నప్పుడో, పంటకు నష్టం వాటిళ్లితేనో, వరదలు వస్తేనో కనీసం పరామర్శించేందుకు కూడా రాలేని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక వస్తే మాత్రం సిగ్గు విడిచి కట్టకట్టుకుని అక్కడికి పోయారని ధ్వజమెత్తారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం నిజామాబాద్ టౌన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాను వైఎస్ఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే కేసీఆర్ మాత్రం దొంగ హామీలకే పరిమితం అయ్యారని మండిపడ్డారు. నిజాంసాగర్ కాలువలకు మరమ్మతులు, తెలంగాణ యూనివర్సిటీ, మంజీరా మీద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వైఎస్సార్ నిర్మించారని చెప్పారు. ఓట్ల కోసం టీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ గెలిస్తే మునుగుడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై షర్మిల ఫైర్ అయ్యారు. అధికారంలో ఉండి, అభివృద్ధి చేయడం చేతకాక దత్తత తీసుకుంటామని చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా కేటీఆర్? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చాయని నీకు దత్తత గుర్తుకువచ్చిందా? గతంలో కొడంగల్‌కు నీవు చేసిందేమిటని నిలదీశారు. ఇన్నాళ్లూ కేటీఆర్‌కు మునుగోడు కనిపించలేదా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చి తప్పినందుకు ముఖ్యమంత్రి కూతురు కవితను ఓడించిన నిజామాబాద్ ప్రజలు సామాన్యులు కారని అన్నారు. ఇక్కడి ప్రజలు నిరుద్యోగులుకు ఉద్యోగాలు లేవని ఏనాడు బాధపడని కేసీఆర్ తన కూతురు నిజామాబాద్‌లో ఓడిపోతే మాత్రం అల్లాడి పోయాడని వెంటనే ఆమెకు ఎమ్మెల్సీ పదవి అప్పగించాడని అన్నారు. అయితే ఆమె ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుపోయిందని విమర్శించారు. బీజేపీ గోడలు బద్దలు కొడతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు లిక్కర్ స్కాంలో కూతురును కాపాడుకునేందుకు ఢిల్లీలో బీజేపీ వాళ్ల కాళ్లవేళ్ల పడి బతిమిలాడుకుంటున్నాడని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని కవితను ఓడించి ధర్మపురి అర్వింద్‌కు అవకాశం ఇస్తే అతను కూడా హామీ ఇచ్చి మోసం చేశాడని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త భూముల గణేష్‌గా మారాడని ఎద్దేవా చేశారు. కనిపించిన భూములను కబ్జాలు చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని అన్నారు.


Next Story

Most Viewed