ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తెలంగాణ ప్రజలందరికి తెలుసు: Y. S. Sharmila

by Disha Web Desk 19 |
ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తెలంగాణ ప్రజలందరికి తెలుసు: Y. S. Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. బుధవారం షర్మిల లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ములేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్‌కు మోదీ సాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్, బీజేపీ ఒకే తానుముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ నడిపే తెరచాటు రాజకీయాలకు ఈ ఎన్నికలే గుణపాఠం అవుతాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.

సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, మద్దతుదారులను ఇబ్బందుల పాలు చేయడమే లక్ష్యంగా.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌పై ఎలాంటి విచారణ ఉండదు, లిక్కర్ స్కాంలో వేలకోట్ల అవినీతి చేసిన కేసీఆర్ బిడ్డపై ఎలాంటి చర్యలు తీసుకోరన్నారు. భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ బందిపోట్లపై ఐటీ, ఈడీ సోదాలు ఎందుకు జరగవని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుందన్నారు. మీ ఆటలు మరెన్నో రోజులు సాగవు.. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story