ఎంత నగదు సీజ్ చేశామో చెప్పలేం: ED

by Disha Web Desk 2 |
ఎంత నగదు సీజ్ చేశామో చెప్పలేం: ED
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల కోసం పనిచేసే ప్రతి ప్రభుత్వ సంస్థ ఏ పనికి ఎంత ఖర్చు పెడుతుందో తెలపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. సామాన్య ప్రజలు ఎవరు అడిగినా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే. దేశంలో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్) దాడులు పలు రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఈడీ గత పదేళ్లలో ఎంత మనీ సీజ్ చేశారు? ఎక్కడెక్కడ ఎవరి మీద, ఏ ఏ రాష్ట్రాలలో తనిఖీలు నిర్వహించారు? తనిఖీలలో పట్టుకున్న డబ్బు ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారు? ఎంత మందిపై కేసులు నమోదు చేశారు? ఎంత మందికి శిక్ష పడిందో వివరాలు తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి సమాచారహక్కు చట్టం ద్వారా ఈడీ కేంద్ర కార్యాలయానికి దరఖాస్తు చేశారు.

కానీ, సమాచారం హక్కు చట్టం ద్వారా అడిగిన వివరాలను ఇవ్వడానికి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం నిరాకరించింది. తాము వివరాలు తెలపడానికి నిరాకరిస్తున్నట్లుగా కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ డైరెక్టర్ రంజన్ ప్రకాష్ స్పష్టం చేశారు.

వాస్తవానికి తీవ్ర స్థాయి మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగిన విషయాలను ప్రజలకు అవసరమైన విషయాలను కేంద్ర ప్రభుత్వాలే స్వచ్ఛందంగా వారి సంబంధిత కార్యాలయం వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచాలి. అదే ప్రాతిపదికన సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అనేక హైకోర్టులు లైవ్ ప్రొసీడింగ్స్ కూడా చేస్తున్నవి. కానీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వంటి అత్యున్నత స్థాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్‌లో ఏం జరుగుతుంది. కనీసం ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా స్పష్టం చేయడానికి, ఆయా శాఖలు ఎందుకు నిరాకరిస్తున్నాయో అర్థం కావడం లేదు.

కనీస ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వనందుకు గాను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ దీనిపై కేంద్ర సమాచార కమిషన్‌కు సెక్షన్ 18 ద్వారా పిటిషన్ ఫైల్ చేస్తామని రాజేంద్ర పల్నాటి తెలిపారు.

Next Story