బేగంపేటలో వింగ్స్ ఇండియా ప్రదర్శన.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2026-01-30 11:12:35  IST  )

వింగ్స్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనడం ఒక గొప్ప అనుభవంగా భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

బేగంపేటలో వింగ్స్ ఇండియా ప్రదర్శన.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వింగ్స్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనడం ఒక గొప్ప అనుభవంగా భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత పౌర విమానయాన రంగం విస్తృతి, వైవిధ్యం, ఆశయాలను అద్భుతంగా ప్రతిబింబించిన వేదిక ఇది అని తెలిపారు. పరిశ్రమ నేతలు, ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లతో పరస్పర చర్యలు ఎంతో ప్రేరణనిచ్చాయని అన్నారు. Airbus H125 హెలికాప్టర్ సిమ్యులేటర్‌ను స్వయంగా ప్రయత్నించడం నాకు ఒక ప్రత్యేక అనుభవంగా నిలిచిందని పేర్కొన్నారు. HAL, AISEL, పవన్ హాన్స్ సహా దేశీ విదేశీ సంస్థల స్టాళ్లలో తయారీ, MRO, డ్రోన్లు, శిక్షణ, ఎయిర్‌పోర్ట్ మౌలిక వసతుల్లో జరుగుతున్న ఆధునిక ఆవిష్కరణలు భారత్ గ్లోబల్ విమానయాన కేంద్రంగా ఎదుగుతున్న దిశను స్పష్టంగా చూపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో 120కి పైగా దేశాల ప్రతినిధుల పాల్గొనడం భారత విమానయాన రంగ వృద్ధిపై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని కొనియాడారు. సురక్షిత, స్మార్ట్, అనుసంధానమైన ఆకాశాల దిశగా భారత్ ఒక ప్రధాన గ్లోబల్ విమానయాన కేంద్రంగా అవతరిస్తున్నదనే నమ్మకాన్ని ఈ ప్రదర్శన మరింత బలపరిచిందని అన్నారు.

వింగ్స్ ఇండియా ప్రదర్శన

కాగా, హైదరాబాద్‌లోని బేగంపేటలో ‘వింగ్స్ ఇండియా’ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం సందర్శకులకు అనుమతి ఇవ్వడంతో నగర ప్రజలు వింగ్స్ ఇండియా ప్రదర్శనకు భారీగా తరలివచ్చారు. ఈ ప్రదర్శనలో భారీ విమానాలతోపాటు చిన్న చిన్న విమానాలను సందర్శకులను ఆకట్టుకున్నాయి. సందర్శకుల కోసం నిర్వహించిన వైమానిక ప్రదర్శన, డ్రోన్ షో ఆకట్టుకున్నాయి. హెలికాప్టర్, విమానాలతో సందర్శకులు సెల్ఫీలు తీసుకున్నారు.

Next Story