రాజకీయాల నుంచి రిటైరవుతా: MP ఉత్తమ్ కుమార్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 19 |
రాజకీయాల నుంచి రిటైరవుతా: MP ఉత్తమ్ కుమార్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొత్తం కమర్షియల్ రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఇలాంటి పాలిటిక్స్‌కు తాను ఏమాత్రం సెట్ అవ్వనని, అందుకే రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక మంచిరోజు చూసుకొని రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తానని ఆయన పేర్కొన్నారు. 2018 నుంచి రాజకీయాలు చాలా కమర్షియల్‌గా మారాయన్నారు. ఈ కమర్షియల్ రాజకీయాల నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

రాజకీయాల్లోకి వచ్చి 30 ఏండ్లవుతోందని, అక్టోబర్‌లోనో, నవంబర్‌లోనో తప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోడీ చరిష్మతో బీజేపీ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోందని, కానీ ఈ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే కాంగ్రెస్‌కే లాభమని ఆయన జోస్యం చెప్పారు. ఇక లిక్కర్ కేసులో శరత్ రెడ్డి అప్రూవర్‌గా మారితే కేసు సీరియస్‌గా టర్న్ అవుతుందని ఆయన తెలిపారు.

శరత్ రెడ్డి అప్రూవర్‌గా మారింది నిజమే అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి అది చావుదెబ్బ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌తో షర్మిల పొత్తుపై ఆయన స్పందించారు. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తుందో లేదో తనకు తెలియదని, కాంగ్రెస్ నుంచి ఎవరో పెద్ద వ్యక్తులు షర్మిలతో మాట్లాడినట్టున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఊపు తగ్గిందని, ఆ పార్టీ నేతలే తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. బీజేపీలో బయటి పార్టీల నుంచి వెళ్లిన నేతలు ఒకవైపు, ఆ పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలు ఒకవైపు అయ్యారని ఆయన చెప్పారు.


Next Story

Most Viewed