కవిత దందాపై కాంగ్రెస్ ఎందుకు స్పందించట్లేదు: బండి సంజయ్

by Disha Web Desk 6 |
కవిత దందాపై కాంగ్రెస్ ఎందుకు స్పందించట్లేదు: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత తప్పులు చేసి సిగ్గులేకుండా ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ అనే దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీక్షలు చేసే అర్హత అసలు కవితకు లేదని ఆయన మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కనీసం స్పందించడం లేదని బండి ధ్వజమెత్తారు. మహిళలపై వేధింపుల కేసుల్లో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ నిలిచిందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులపై మహిళా సర్పంచ్ లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లలేని దుస్థితి ఎందుకు నెలకొందని బండి ప్రశ్నించారు.

మహిళా బిల్లుపై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదో సమాధానం చెప్పాలని బండి ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన పార్టీ కేవలం బీజేపీయేనని ఆయన కొనియాడారు. విదేశీ, ఆర్థిక మంత్రులను మహిళలను చేసిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో మహిళలపై జరుగుతున్న దాడులపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని బండి ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో 33 శాతం మహిళలకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఎమ్మెల్సీ కవిత.., తెలంగాణ మహిళలు తలదించుకునే దుస్థితికి తెచ్చారని ఫైరయ్యారు. కవిత చేసే దందాలో తెలంగాణ మహిళలకు ఏమైనా వాటా ఇస్తోందా అని బండి ప్రశ్నించారు. తప్పు చేసి సిగ్గు లేకుండా ఢిల్లీ వెళ్లి దీక్ష చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలే లేరని, కవిత పాపులారిటీ తగ్గిపోతుందని.. ఆ పార్టీలో ఇతర మహిళలను కనీసం మాట్లాడనివ్వని దుస్థితి నెలకొందన్నారు. ఈడీ నోటీసులకు భయపడే దీక్ష చేపడుతున్నారని చురకలంటించారు.

బీఆర్ఎస్ పార్టీకే అతీగతి లేదని, ఢిల్లీ వెళ్లి దీక్ష చేసినా వారినెవరూ పట్టించుకోవడం లేదని బండి ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఢిల్లీలో దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలపై ఈడీ దాడులు జరిగితే సీఎం కేసీఆర్ ఏనాడూ స్పందించలేదని, అలాంటిది సీఎం కేసీఆర్ కూతురికి ఈడీ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా? అని బండి పేర్కొన్నారు. కవిత చేసిన దందాపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని, కవిత చేసిన దందాపై కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అనేందుకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో రేవంత్ రెడ్డి కి ఏమైనా సంబంధం ఉందా అని, ఆయన ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళలపై దాడులు చేసే వారిని బీఆర్ఎస్, ఎంఐఎం జెండాలు కాపాడుతున్నాయని బండి ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా ఈ దీక్షకు బీజేపీ సీనియర్ లీడర్లు, అనుబంధ మోర్చాల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు.



Next Story

Most Viewed