మంత్రి ఉండగానే క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం పోసి రైతు నిరసన

by Disha Web Desk 4 |
మంత్రి ఉండగానే క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం పోసి రైతు నిరసన
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన సెగ తగిలింది. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ కమలపూర్ గ్రామానికి చెందిన సట్టం శెట్టి రాజన్న అనే రైతు శనివారం ఉదయం తాను పండించిన ధాన్యం ట్రాక్టర్‌లో తీసుకొచ్చి ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు పోసి నిరసన వ్యక్తం చేసాడు. తరుగు లేకుండా, రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి చెప్పినా కూడా కొనుగోలు చేయడం లేదని రాజన్న ఆరోపించాడు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే మిల్లర్లు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ రైతు దినోత్సవం రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై నేడు ధర్మపురిలో వేడుకలు నిర్వహించాల్సి ఉంది. దీని కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ రాత్రి క్యాంప్ ఆఫీసులో బస చేశారు. అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంప్ ఆఫీస్‌లో ఉండగానే ట్రాక్టర్‌లో ధాన్యం తీసుకువచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోసి నిరసన తెలపడం చర్చనీయంశంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ధాన్యాన్ని తీసివేసి ట్రాక్టర్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తుంది. అకాల వర్షాల కారణంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని, రైతుల బాధలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనే ఈ విధంగా చేసినట్లు రైతు తెలిపాడు.

Also Read..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. ఎన్నికల వేళ షాక్ ఇస్తున్న క్యాడర్


Next Story

Most Viewed