Delhi Liquor Case : కవితను అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం ?

by Dishanational2 |
Delhi Liquor Case : కవితను అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం ?
X

దిశ,తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవితను ఒకవేళ ఈడీ అరెస్టు చేస్తే ఆందోళనలు చేపట్టేలా బీఆర్ఎస్ లీడర్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. కేంద్రానికి వ్యతిరేకంగా స్టేట్‌వైడ్‌గా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. వీలైతే ఓ రోజు బంద్‌కు పిలుపునిచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ..ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణ తర్వాత అమెను ఈడీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నదని జోరుగా ప్రచారం జరుగుతున్నది.

ఆందోళనలు చేయాలని మౌఖిక ఆదేశాలు

కవితను అరెస్ట్ చేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా లీడర్లకు ప్రగతిభవన్ వర్గాల నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఎక్కడెక్కడ అందోళనలు చేయాలి? ఏయే రూపంలో నిరసన తెలపాలి? రాస్తారోకోలు చేయాలా? కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలా? బంద్‌కు పిలుపునివ్వాలా? అనే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ల మధ్య జరుగుతున్నది. అయితే ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత వెళ్లే రోజున గులాబీ లీడర్లు ఇతర కార్యక్రమాలు ఏం పెట్టుకోవద్దని, అందరూ లోకల్‌గా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం సాగుతున్నది. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీలోని బీఆర్ఎస్ లీడర్లు కూడా నిరసనలు చేపట్టాలని సూచించినట్టు సమాచారం.

ఆందోళనలో మంత్రులు, ఎమ్మెల్యేలు

ఆందోళనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు స్వయంగా పాల్గొనాలని సూచించినట్టు సమాచారం. జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసనల్లో లోకల్ మంత్రులు, లీడర్లు హాజరు కావాలని ఆదేశించినట్టు తెలిసింది. అలాగే జాతీయ రహదారులను కొంత సేపు దిగ్బంధనం చేస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారు. అయితే హైదరాబాద్‌లోని కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు కూడా నిరసనలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతున్నది.

బంద్ పాటిద్దామా?

అధికార పార్టీ హోదాలో బీఆర్ఎస్ ఇప్పటికే పలు ఆందోళనలు చేపట్టింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, వరి ధాన్యం కొనుగోళ్ల అంశాలపై జరిగిన నిరసనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొన్నారు. ఇదే అంశంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇప్పుడు కవితను ఈడీ అదుపులోకి తీసుకుంటే రాష్ట్ర బంద్‌కు పిలుపిద్దామా? అనే కోణంలో బీఆర్ఎస్‌లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఆ నిరసనల్లో ప్రజలు ఏ మేరకు భాగస్వామ్యం అవుతారనే అనుమానం కూడా పార్టీలో ఉన్నట్టు ఓ సీనియర్ నేత వివరించారు.

ఢిల్లీలో నిరసనలకు ప్లాన్?

కవిత అరెస్ట్ జరిగితే ఢిల్లీలోనూ ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత అధ్వర్యంలోని తెలంగాణ జాగృతి ఈనెల 10న జంతర్ మంతర్ వద్ద దీక్షకు రెడీ అవుతున్నది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో జాగృతి కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లారు. కవితను అదుపులోకి తీసుకున్న వెంటనే నిరసలను, ఆందోళనలు చేయాలని జాగృతి కార్యకర్తలను ప్రిపేర్ చేసినట్టు తెలిసింది.


ఇవి కూడా చదవండి :

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎల్లుండి ఈడీ విచారణకు కవిత

కేబినెట్ మీటింగ్‌ ఈడీపైనే! యాక్షన్ ప్లాన్‌పై చర్చించే ఛాన్స్



Next Story

Most Viewed