ఎంపీ ఎన్నికల్లో టీటీడీపీ వ్యూహమేంటి?.. ఈసారి తెలుగు తమ్ముళ్ల ఓట్లెటువైపు?

by Disha Web Desk 13 |
ఎంపీ  ఎన్నికల్లో టీటీడీపీ వ్యూహమేంటి?.. ఈసారి తెలుగు తమ్ముళ్ల ఓట్లెటువైపు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.గెలుపే లక్ష్యంగా పొత్తులు, ఎత్తుగడలతో న్యూ ఈక్వేషన్స్ కోసం పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుండగా తెలంగాణ విషయంలో మాత్రం అధినేత చంద్రబాబు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్నికల షెడ్యూల్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో టీటీడీపీ వ్యూహం ఏంటన్న దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది.

కాంగ్రెస్ వైపా? కమలం వైపా?

రాష్ట్రంలో టీడీపీ యాక్టివిటీ పెద్దగా లేకున్నా ఆయా చోట్ల పార్టీకి చెప్పుకోదగిన కేడర్, సానుభూతి పరులు ఉన్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. దీంతో టీడీపీ మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేశాయి. తెలుగు దేశం జెండాలను పట్టుకుని పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. అయితే తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్‌కు అండగా నిలిచారనే టాక్ ఉంది. అయితే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనైనా పార్టీ బరిలో ఉంటుందా? పోటీ చేయకపోతే ఆ పార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు? అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కాంగ్రెస్ వైపా? లేక ఏపీలో పొత్తు నేపథ్యంలో బీజేపీ వైపా? అనేది ఆసక్తిగా మారింది.

అధ్యక్షుడేడీ?

అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బాలకృష్ణ ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ నేతలతో భేటీ అయి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం పెద్దగా కనిపించలేదు. అనంతరం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పటినుంచి తెలంగాణ శాఖకు కనీసం అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏపీలో పార్టీ అధికారం వైపు దూసుకెళ్తుండగా, టీటీడీపీ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది.



Next Story