కేంద్రం నుంచి ఏకాణా తేనోళ్లు లేఖలు రాయడం ఏంది.. మంత్రి పోన్నం సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-06 06:22:13  IST  )

కేంద్రం నుంచి ఏకాణా తేలేని వారు కూడా తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు.

కేంద్రం నుంచి ఏకాణా తేనోళ్లు లేఖలు రాయడం ఏంది.. మంత్రి పోన్నం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం నుంచి ఏకాణా తేలేని వారు కూడా తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి బీజేపీ చీఫ్ రాంచందర్ రావు (Ramchander Rao) లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్, రాంచందర్ రావుకు ప్రతి లేఖ రాశారు. అందులో కేంద్రంలో నరేంద్ర మోడీ స‌ర్కార్ మెగా ఫెయిల్యూర్స్ సంగ‌తేంది రామ‌చందర్ రావును ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలను అడుగ‌డునా వంచిస్తోందని అన్నారు. గత మూడు ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్రధాన హ‌మీల‌ను విస్మరించారని మండిపడ్డారు.

వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం త‌ప్ప బీజేపీ (BJP) చేసిందేమి లేదన్నారు. రైతులు, యువ‌కులు, మ‌హిళ‌లు, పేద‌లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను వంచించిన చరిత్ర వారిదని ఆక్షేపించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల మెనిఫెస్టోలో 60 ఏళ్లు దాటిన సన్నకారు రైతులకు పించన్లు ఇస్తామని అన్నారని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. పంట పెట్టుబ‌డి సాయం కోసం రైతుల‌కు ఏడాదికి ఇచ్చే రూ.6 వేల కిసాన్ స‌మ్మాన్ నిధి (Kisan Samman Nidhi)ని పెంచుతామ‌ని ప్రగల్భాలు పలికారని.. అది కూడా మర్చిపోయారని ఆరోపించారు. గత 11 ఏళ్లలో తెలంగాణ‌కు ఒక్క రూపాయి కేంద్ర నుంచి రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. నిధుల విషయంలో వారు ఏం చేశారో చెప్పాలన్నారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల‌ను భర్తీ చేస్తామ‌ని చెప్పారని.. ఆ విషయం ఏమైందని ప్రశ్నించారు.

లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ను రూ.70 నుంచి రూ. 110కి పెంచింది మీరు కాదా అని రాంచందర్ రావును ఉద్దేశించి మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,100 చేసి నిరుపేదల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. విద్వేశ ప్రచారం, విధ్వంస చ‌ర్యలు, రాజ‌కీయ నియంతృత్వం, ఆర్థిక వ్యవ‌స్థలో కార్పోరేట్ల పెత్తనం, మత ఆధిప‌త్యం, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ హాయంలో ప్రజ‌ల‌ జీవ‌న ప్రమాణాలు మెరుగుప‌డ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు- రంగా‌రెడ్డి (Palamuru Rangareddy) ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వకుండా మోసం చేశారని, కృష్ణా జ‌లాల్లో నీటి వాట తెల్చకుండా నాన్చుతుంది మీరు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజ‌ల‌ను వంచించి.. ఒట్టి లేఖ‌లు రాస్తే ప్రయోజనం లేదన్నారు. చేత‌నైతే ప్రధాని మోడీకి లేఖ రాసి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హ‌మీల‌ను నెర‌వేర్చాలని డిమాండ్ చేశారు. అంతే గాని ఏడాదిన్నర క్రితం ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం అప్పుడే అన్ని చేసేయాల‌ని ఇలా లేఖ‌లు రాయ‌డం మీ గుడ్డి ద్వేషానికి అద్దం ప‌డుతోందని పొన్నం ప్రభాకర్ అన్నారు.

Next Story