CM Revanth Reddy : ఎస్ఎల్బీసీలో అవసరమైతే రోబోలను వాడుతాం : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-03-03 07:31:38  IST  )

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) గురించి తెలిసిందే.

CM Revanth Reddy : ఎస్ఎల్బీసీలో అవసరమైతే రోబోలను వాడుతాం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్/ అచ్చంపేట : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) గురించి తెలిసిందే. కాగా ఈ టన్నెల్ ప్రమాదస్థలానికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేరుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Jupalli KrishnaRao)తో కలిసి సీఎం టన్నెల్ లోపలికి వెళ్లారు. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన 8 మంది సిబ్బంది మృతదేహాలను బయటికి తెచ్చేందుకు జరుగుతున్న సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రులతో కలిసి సీఎం మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రపంచంలో అత్యంత పొడవైన, గొప్ప మానవ నిర్మిత సొరంగ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ అన్నారు. అలాంటి ప్రాజెక్టులో దురదృష్టకర ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు దేశ భద్రతకు పని చేసే ఆర్మీ, నేవీ, ఎన్డీ ఆర్ ఎఫ్, సింగరేణి, ప్రభుత్వ, ప్రైవేట్ అన్నీ కలిపి 11 సంస్థలు ఈ రెస్క్యూలో పని చేస్తున్నారని వివరించారు. తెలంగాణ సీఎంగా ఆయా రెస్క్యూ సంస్థల(SLBC Rescue Teams)ను తాను అభినందిస్తున్నాను తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని, రేపటి లోగా కన్వేయర్ బెల్ట్ రిపైర్ చేసి లోపల కూలిన మట్టిని బయటికి తీస్తారని తెలియ జేశారు.

ఈ సందర్భంగా మీడియాకు, విపక్షాలు దీనిని రాజకీయం చేయకుండా సమస్య పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. ప్రమాదం జరిగిన గంటలోనే మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబో(Robots)లను వాడతామని, ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సొరంగ నిర్మాణంలో కూడా రోబోలను వాడతామని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించే బాధ్యత తమపై ఉందన్నారు.

ఇంతవరకు రాడార్లు మార్క్ చేసిన దగ్గర ఎలాంటి డెడ్ బాడీస్ దొరకలేదని, ప్రాజెక్టు పనిలో వాడిన ఎక్విప్మెంట్స్ దొరికాయని అన్నారు. నీరు, బురద ఉధృతంగా ఉండటం వలన సహాయక చర్యలు నెమ్మదిగా జరుగుతున్నట్టు తెలిపారు. లోపల చిక్కుకున్న కార్మికులకు ఏం జరిగిందో తాను ఇప్పుడే చెప్పలేనని, మీడియా మిత్రులకు ఎంత అవగాహన ఉందో.. తనకు కూడా అధికారులు, రెస్క్యూ టీం అంతే వివరాలు అందించారన్నారు. లోపల ఉన్నవారి పరిస్థితిని తాను ఊహించి చెప్పేలేనని అన్నారు. కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి అన్ని విధాల అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story