Minister Srinivas Goud: కాళేశ్వరం తరహాలో 'పాలమూరు' ను పూర్తి చేస్తాం:

by Disha Web Desk 11 |
Minister Srinivas Goud: కాళేశ్వరం తరహాలో పాలమూరు ను పూర్తి చేస్తాం:
X

దిశ, మహబూబ్ నగర్: పూర్వం తెలంగాణలో సాగునీటి సంగతి దేవుడెరుగు తాగడానికి సైతం నీరు లేకుండేదని, చెరువుల పూడిక తీసి నీళ్లతో నింపి, సాగునీటి సమస్యను తీర్చామని, కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన 'సాగునీటి దినోత్సవానికి' ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అతి కొద్ది సమయంలోనే చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, భారతదేశంలో యాసంగిలో మొత్తం దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలలో వరి పంట సాగైతే, అందులో 56 లక్షలు కేవలం తెలంగాణ నుంచి మొదలైందని తెలిపారు.

దీనిని బట్టి మన పంటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించాలని తెలిపారు. గతంలో ఇరిగేషన్ శాఖకు ఎలాంటి గుర్తింపు ఉండేది కాదని ఇప్పుడు అందరికన్నా అత్యంత అద్భుతంగా ఇరిగేషన్ శాఖ పనిచేస్తున్నదని మంత్రి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందని, కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తయితే జిల్లా సశ్యశ్యామలం అవుతుందని తెలిపారు. కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లు పూర్తయితే త్వరలోనే కాల్వల నిర్మాణానికి పిలిచి పనులను పూర్తి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో నిర్మించిన చెక్ డ్యాంల వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, కోయిల్ సాగర్ ను గ్రావిటీ ద్వారా నింపనున్నామని, అదేవిధంగా జూరాల ప్రాజెక్టును తిరుగు జలాల ద్వారా నింపే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ద్వారా అన్ని చెరువులను నింపి వ్యవసాయానికి సాగునీటితో పాటు, చేప పిల్లల పెంపకాన్ని చేపడతామని అన్నారు. కోర్టు కేసుల వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని మంత్రి పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చేపట్టనున్న చెక్ డ్యాంల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్ అధికారులని ఆదేశించడమే కాక వచ్చే సంవత్సరం నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని పరిశీలించాలని, ముఖ్యంగా మినీ ట్యాంక్ బండ్ రివిట్మెంట్ పనులపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు సైతం అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మన ఊరు-మన భవిష్యత్ గా భావించి ఉద్యోగులు పనిచేయాలని ఆయన అన్నారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ రమణా రెడ్డి మాట్లాడారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతుబంధు కో-ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, ఎస్ఈ చక్రధరం, ఈఈలు దయానంద్, వెంకటయ్య, పిఎసిఎస్ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, డిఈ మనోహర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్..

మూడు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని శిల్పారామం వద్ద 'ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నెల 8 నుండి10 వ తేది వరకు జరిగే ఈ ఫెస్టివల్ లో చేపలు, రొయ్యలతో తయారు చేసిన అన్ని వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

బీఆర్ఎస్ లోకి వలసలు...

జిల్లా కేంద్ర సమీపంలోని దివిటిపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు షేక్ యాకూబ్, సయ్యద్ యాకూబ్, సయ్యద్ ఇమ్రాన్ షా లతో సహ 100 మంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాండురంగారెడ్డి, ముఖరంజ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రి వారికి గులాబీ కండువా వేసి ఆహ్వానించారు.



Next Story

Most Viewed