మీరెంత కష్టపెట్టారో మేమింకా మరువలేదు.. కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డికి ఊహించని షాక్

by Disha Web Desk 13 |
మీరెంత కష్టపెట్టారో మేమింకా మరువలేదు.. కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డికి ఊహించని షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంపీ ఎన్నికల ముంగిట్లో కీలక నేతల జంపింగ్‌లు ఆసక్తిని రేపుతున్నాయి. బీఆర్ఎస్‌కు చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారగా వారిలో కొందరికి టికెట్లు సైతం వచ్చాయి. అయితే అదే కోవకు చెందిన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కినా పార్టీ శ్రేణుల సహకారంపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తమ నిరసనను తెలుపుతూ పోస్టర్లు వైరల్ చేస్తున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన వ్యవహారానికి ఇప్పుడు తిప్పలు తప్పడం లేదనే చర్చ సామాజిక మాధ్యమాల్లో సాగుతోంది.

మేమింకా మరువలేదు..

రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో పలువురు పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఆయన గత నిర్వాకాన్ని తూర్పారబడుతున్నారు. ‘కాంగ్రెస్ అధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించింది సంతోషం. కానీ మీరు మమ్మల్ని(కాంగ్రెస్ కార్యకర్తలను) మా ప్రసాద్ అన్నను (వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్) ఓడించడానికి ఎంత కష్టపెట్టారో మేము ఇంకా మర్చిపోలేదు. మా జెండా లేకుండా చేద్దామనుకున్న మీరు ఇప్పుడు అదే జెండా నీడకు రావడం.. కాలం ఎంత తొందరగా మారింది. మీరు వచ్చారు సరే కానీ మీ ఊసరవెల్లి కార్యకర్తలు రావద్దు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రసాద్ అన్న ఆదేశాన్ని పాటిస్తారు. మాకంటూ ఒక సిద్ధాంతం, పద్ధతి ఉంది.’ అంటూ వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో డిజిటల్ పోస్టర్ వైరల్ అవుతోంది.

స్పీకర్ అభిమానుల ఆగ్రహం!

తాజా పరిణామాలతో రంజిత్ రెడ్డికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంతవరకు అనుకూలించడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు రంజిత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆయన పట్ల కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అభిమానులు రంజిత్ రెడ్డి పెట్టిన టార్చర్ మర్చిపోలేదంటూ క్షేత్రస్థాయిలోని వాట్సాప్ గ్రూప్‌లలో ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సిట్టింగ్ ఎంపీ రాజకీయ భవిష్యత్తు ఆయన కాంగ్రెస్ శ్రేణులను కలుపుకుపోవడంపై ఆధారపడి ఉందనే చర్చ చేవెళ్ల సెగ్మెంట్‌లో వినిపిస్తోంది.

Next Story

Most Viewed