ఈ కలెక్టర్ మాకొద్దు అంటున్న మంత్రి.. సీఎస్‌కు లేఖ?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-12 02:54:26  IST  )

ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాకు తమ శాఖలో పోస్టింగ్ ఇవ్వొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సీఎస్ రామకృష్ణారావుకు లేఖ రాసినట్లు తెలుస్తున్నది.

ఈ కలెక్టర్ మాకొద్దు అంటున్న మంత్రి.. సీఎస్‌కు లేఖ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాకు తమ శాఖలో పోస్టింగ్ ఇవ్వొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సీఎస్ రామకృష్ణారావుకు లేఖ రాసినట్లు తెలుస్తున్నది. వివాదాస్పదుడిగా ముద్రపడిన సదరు ఆఫీసర్‌ను తమ శాఖలో చేర్చుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ‘ప్రతి విషయంలోనూ ఇబ్బంది పెడతారని ఆయనకు పేరుంది. అలాంటి ఆఫీసర్ మా శాఖకు వద్దు. అపాయింట్ చేసే ముందు నన్ను సంప్రదిస్తే బాగుండేది’ అంటూ మంత్రి కామెంట్ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా సిరిసిల్ల కలెక్టర్‌గా రిలీవ్ అయిన సందీప్ ఇంత వరకూ ఆర్‌అండ్‌బీ శాఖలో జాయిన్ కాలేదు.

వ్యవహారతీరుతో వివాదాల్లో..

సందీప్ కుమార్ ఝాకు సమర్ధుడైన అధికారి అనే పేరు ఉంది. కానీ ఆయన వ్యవహార తీరుతో వివాదాల్లో ఇరుక్కుంటున్నారనే విమర్శలున్నాయి. రూలింగ్ పార్టీ లీడర్లతో గొడవలు పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. మిడ్ మానేరు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించలేదు. పైగా అక్రమ కేసులు పెట్టించారని బాధితులు ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై సందీప్‌ను స్వయంగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఆయన అటెండ్ అయ్యారు. ఆ సమయంలో ధర్మాసనం ఆయన డ్రెసింగ్ సెన్స్ సరిగ్గా లేదని, ఆయన్ను చూస్తే తమకే భయంగా ఉందని కామెంట్ చేసింది.

జెండా వందనానికి ఆలస్యంగా..

సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిరిసిల్ల జిల్లాకు చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన విప్ ఆది శ్రీనివాస్ నిర్ధారించిన టైంకు వెళ్లి జెండా ఎగుర వేశారు. దీనికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలస్యంగా వెళ్లారు. ఈ ఘటనపై ఆది శ్రీనివాస్.. సీఎం, సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ను బదిలీ చేయాలని కోరారు. ప్రొటోకాల్ రూల్స్ పాటించనందుకు కలెక్టర్‌గా ఉన్న సందీప్‌ను అక్కడి నుంచి ఆర్‌అండ్‌బీ శాఖకు ట్రాన్స్‌ఫర్ చేశారు.

Next Story