ఎమ్మెల్యే రాజయ్యకి మహిళా కమిషన్ నోటీసులు

by Dishanational1 |
ఎమ్మెల్యే రాజయ్యకి మహిళా కమిషన్ నోటీసులు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే రాజ‌య్య త‌న‌ను లైగింక వేధింపుల‌కు పాల్పడుతున్నట్లు హ‌న్మకొండ జిల్లా ధ‌ర్మసాగ‌ర్ మండ‌లం జానకీపురం సర్పంచ్ నవ్య ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె వ్యాఖ్యల ఆధారంగా మ‌హిళా క‌మిష‌న్‌ సుమోటో కేసుగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. రాజయ్యపై సర్పంచ్‌ చేసిన ఆరోపణలు నిజామా? కాదా? అనే అంశాలను తేల్చాలంటూ డీజీపీకి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి లేఖ రాశారు. ఒకవేళ సర్పంచ్‌ ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ నిర్ణయించినట్టు సమాచారం.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్‌ లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసిన విష‌యం తెలిసిందే. మాట విననందుకు తనపై స్టేషన్‌ ఘన్ పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు దిగుతున్నారని నవ్య పేర్కొంది. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని.. నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించింది. మరోవైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. ఇదంతా పార్టీలోని ఇంటి దొంగలు తన పై చేస్తున్న రాజకీయ కుట్ర అని రాజయ్య చెప్పుకొస్తున్నారు.



Next Story

Most Viewed