సెంటు జాగ క‌బ్జా చేయ‌లేదు.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

by Dishafeatures2 |
సెంటు జాగ క‌బ్జా చేయ‌లేదు.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : సెంటు భూమి క‌బ్జా చేసిన‌ట్లు నిరూపించినా శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ఎమ్మెల్యే న‌రేంద‌ర్ అన్నారు. ఎమ్మెల్యే న‌రేంద‌ర్ భూ క‌బ్జాకోరు అంటూ మావోయిస్టులు శ‌నివారం లేఖ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఓ కబ్జాకోరంటూ మావోయిస్టు జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి డివిజన్‌ కార్యదర్శి వెంకటేశ్‌ ప్రకటనలో తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. ఎమ్మెల్యే నరేందర్‌, మాంగళ్య‌ షాపింగ్‌ మాల్ య‌జ‌మాని నమశ్శివాయతో పాటు మరికొంత మంది బినామీల‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

నాలుగేళ్లుగా నరేందర్‌ నగరంలో భూమాఫియాకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఆ పత్రాలతో బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో లోన్‌ తీసుకుని దర్జా చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌పై ఆదివారం వరంగల్ మహేశ్వరి గార్డెన్ లో తూర్పు నియోజకవర్గంలోని వ్యాపారుల‌తో నిర్వ‌హించిన ఆత్మీయ సమ్మేళనంలో స్పందించారు. తనపైన నిరాదరణ ఆరోపణలు చేయ‌డం స‌రికాద‌ని అన్నారు. రాజకీయంగా లబ్దిపొందడానికి తనపై కావాలనే కొందరు నిరాదరణ ఆరోపణలు చేయిస్తున్నార‌ని అన్నారు. తనకు నియోజకవర్గంలో తాను ప్రస్తుతానికి నివాసముంటున్న ఇల్లుతో పాటు ఏఎస్ఎం కళాశాల దగ్గర ఉన్న నివాసం తప్ప సెంటు జాగా కూడా ఈ నియోజకవర్గంలో లేదని తెలిపారు.


తాను నిరుపేద కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తినంటూ తెలిపారు. వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోవడం తప్ప అక్రమంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని అన్నారు. తాను నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే ఓర్వలేని కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కొందరు నాయకులకు కొమ్ముకాసే కొన్ని ఆన్లైన్ దినపత్రికలో తనపై నిరాదరణ ఆరోపణలతో ప్రచురిస్తున్నారని, వారందరిపై తప్పకుండా సీపీ దృష్టికి తీసుకొని పోయి కఠినంగా శిక్షించాలని కోరుతామన్నారు. తనపై అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేసే వారు ఎవ్వరైనా దమ్ముంటే నిరూపించాలని, వారు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఎమ్మెల్యే అన్నారు.



Next Story

Most Viewed