తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది:మంత్రి ఎర్రబెల్లి

by Disha Web Desk 11 |
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది:మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, దేవరుప్పుల, (పాలకుర్తి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం పాలకుర్తి మండలంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో బీఅర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్యఅతిథిగా మంత్రి ఆయన సతీమణి ఎర్రబెల్లి ఉష దయాకర్ రావుతో కలిసి పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దంపతులకు పార్టీ శ్రేణులు కోలాటాలు, డప్పు చప్పుళ్లతో పూలు చల్లుతూ ఎడ్లబండిపై ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తల కోరిక మేరకు లంబాడి కోలాటం నృత్యం చేసి ఆకట్టుకున్నారు.

సీఎం ప్రసంగా సారాంశాన్ని ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉష దయాకర్ రావు కార్యకర్తలకు చదివి వినిపించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కొన్ని అరాచ‌క శ‌క్తులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాల‌ని, అస్థిర ప‌ర‌చాల‌ని చూస్తున్నాయని అలాంటి శ‌క్తులే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు ప‌న్నుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని పార్టీ పరంగా కార్యకర్తలు, ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండి కుట్రల‌ను దీటుగా ఎదుర్కోవాలని సూచించారు. అనంతరం మహిళలకు పార్టీ శ్రేణులకు భోజనం వడ్డిస్తూ ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు వారితో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇంచార్జి ఎమ్మెల్సీ మంకెన కోటి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story