- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జవహర్ నగర్ లో భూకబ్జా ఆరోపణలు..పట్టించుకోని అధికారులు
జవహర్ నగర్లో భూకబ్జాల పర్వం రోజు రోజుకూ హద్దులు దాటుతోంది.

దిశ, (వెంకటాపూర్,రామప్ప): జవహర్ నగర్లో భూకబ్జాల పర్వం రోజు రోజుకూ హద్దులు దాటుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధి ఒకరు.. అధికార బలంతో సామాన్య రైతుపై దౌర్జన్యానికి దిగడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం...ఓ సామాన్య రైతు తన సొంత పొలంలోకి వెళ్లగా, అతన్ని సదరు ప్రజా ప్రతినిధి కొంతమంది అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని బెదిరించారు. ఆ భూమి తమదేనంటూ పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా, యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 1851లో జరిగిన భూకబ్జా ఉదంతం వెలుగు చూసి మూడు నెలలు గడుస్తున్నా, నేటికీ బాధితుడికి న్యాయం జరగకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒక వైపు బాధితుడు మహమ్మద్ ఇస్మాయిల్ తన భూమిని కాపాడుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే, అధికారులు మాత్రం కబ్జాదారుడికి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా బాధితుడు మహమ్మద్ ఇస్మాయిల్ వేరే ప్రాంతంలో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు తన పదవిని, రాజకీయ బలాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ భూమిని దర్జాగా కబ్జా చేశారు. బాధితుడు ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. మూడు నెలల క్రితమే ఈ వ్యవహారం మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ జరగకపోవడం గమనార్హం. బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, ఫైళ్లు ముందుకు కదలకుండా రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి, బాధితుడికి న్యాయం చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
- Tags
- land
- land grabing






