Medaram Jatara 2026 : సమ్మక్క రాకతో పులకించిపోయిన చిలకలగుట్ట రహదారులు

by Taduka Kalyani |

చిలుకల గుట్ట నుంచి సమ్మక్క రాకతో మేడారం చిలకలగుట్ట రహదారులు పులకించిపోయాయి

Medaram Jatara 2026 : సమ్మక్క రాకతో పులకించిపోయిన చిలకలగుట్ట రహదారులు
X

దిశ మేడారం న్యూస్ నెట్వర్క్ : చిలుకల గుట్ట నుంచి సమ్మక్క రాకతో మేడారం చిలకలగుట్ట రహదారులు పులకించిపోయాయి. శ్రీ సమ్మక్క తల్లికి ఘనంగా స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రహదారుల వెంబడి రంగవల్లులు, బలులు సమర్పించి అమ్మవారి రాక కోసం వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తూ తన్మయత్వం లో మునిగిపోతున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు,యువకులు అనే తేడా లేకుండా ఆనందంతో అమ్మవారి రాక కోసం జై సమ్మక్క తల్లి జై సారక్క తల్లి అనే నినాదాలతో చిలకల గట్టు రహదారి మారుమోగిపోయింది. సమ్మక్క తల్లి వచ్చే దారి వెంబడి అధిక సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయింది. చెట్లు వాహనాలు వాటర్ ట్యాంకులు భవనాలు ఎక్కి అమ్మవారి రాకను స్వయంగా తిలకించాలని ఆత్రుతతో భక్తులందరూ ఉన్నారు. ముగ్గులు,ఎదుర్కొల్లు, బలులతో రహదారి కిక్కిరిసిపోయింది. శివసత్తుల పూనకలు,సమ్మక్క తల్లిని ఆవరించుకుని భక్తులు డాన్సులు వేస్తూ అమ్మవారి రాకను స్వాగతిస్తూ ఉన్నారు. చిలకల గట్టు నుంచి ఈరోజు గద్దెలపైకి అమ్మవారు చేరుకోనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారి వెంబడి భారీకేడ్లు నిర్మించి రక్షణగా ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ గిరిజన సంఘాలు, అభ్యుదయ యువజన సంఘం, తుడుం దెబ్బ, ప్రత్యేక పోలీసు బలగాలు తదితర విభాగాల శాఖల సమన్వయంతో కలిసి అమ్మవారిని తోడుకొని వస్తున్నారు. ఈ అపూర్వమైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story