పటిష్ట ప్రణాళికతో పరకాల డైరీని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

పరకాల మహిళా డెయిరీని పటిష్ట ప్రణాళికతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.

పటిష్ట ప్రణాళికతో పరకాల డైరీని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
X
దిశ, వరంగల్ బ్యూరో : పరకాల మహిళా డెయిరీని పటిష్ట ప్రణాళికతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో పాల ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యూహాలు, రైతుల సంక్షేమంపై సమగ్రంగా చర్చించారు.
పరకాల మహిళా డెయిరీని ఒక ఆదర్శ మోడల్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. పాల సేకరణ, ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్ అనే నాలుగు అంశాలే డెయిరీ విజయానికి కీలకమని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఈ డెయిరీ బలమైన వేదికగా నిలవాలని, గ్రామీణ మహిళలకు స్థిర ఆదాయం కల్పించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరగాలని, వారం లేదా పది రోజుల్లోనే చెల్లింపుల వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. రైతులకు బోనస్, గ్రూప్ ఇన్సూరెన్స్, పశు బీమా వంటి సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. మార్కెట్‌లో పోటీని తట్టుకునేలా సమర్థవంతమైన బ్రాండింగ్, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. రిటైలర్లు, మిల్క్ పార్లర్ల ఎంపికను వేగవంతం చేయాలని, పాల సరఫరా చేసే రైతుల వివరాలను లీటర్ల ఆధారంగా వర్గీకరించి సమగ్ర డేటా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. డెయిరీ కార్యకలాపాల్లో పారదర్శకత, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ పరకాల మహిళా డెయిరీని కేవలం ఉత్పత్తి కేంద్రంగా కాకుండా మహిళల సాధికారతకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. మార్కెట్‌లో ఉన్న వివిధ పాల బ్రాండ్ల విక్రయాలు, వినియోగదారుల అభిరుచులు, పోటీ పరిస్థితులను అధ్యయనం చేసి వాటికి అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించాలని తెలిపారు. నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా వినియోగదారుల విశ్వాసం గెలుచుకోవాలని చెప్పారు. అలాగే డెయిరీ నిర్వహణలో ప్రతి స్థాయిలో డేటా ఆధారిత విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ పాల సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రైతుల వర్గీకరణ, పాల సరఫరా పరిమాణం, చెల్లింపుల విధానం వంటి అంశాలను డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని తెలిపారు. డెయిరీకి అవసరమైన మౌలిక వసతులు, మార్కెటింగ్ చానెల్స్‌ను సమన్వయంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. రైతుల విశ్వాసమే డెయిరీకి బలమని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. ఈ సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్‌రావు, అదనపు డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎం సరిత, ఏపీఎం దివాకర్‌రాయ్, జనరల్ మేనేజర్ కృష్ణ, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

Next Story