ఉద్యోగ సంఘాల ధర్నాకు మావోయిస్టు పార్టీ మద్దతు

by Web Desk |
ఉద్యోగ సంఘాల ధర్నాకు మావోయిస్టు పార్టీ మద్దతు
X

దిశ భూపాలపల్లి : 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఫిబ్రవరి 5న తలపెట్టిన మహా ధర్నాకు మావోయిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని తెలిపారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనలేమని తెగేసి చెప్పడం సరికాదని పేర్కొన్నారు. అశాస్త్రీయ పద్ధతుల్లో తీసుకొచ్చిన 317 జీవో ద్వారా బలవంతంగా బదిలీలు చేపట్టడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్థానికతను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జీవో వల్ల కొంత మంది ఉపాధ్యాయులు మానసిక వేదనతో ప్రాణాలు సైతం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అన్ని సమస్యలకూ కారణమైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విరోచితంగా పోరాడాలని పిలుపు ఇస్తున్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed