- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్దం.. రేపటి నుంచి 12 రోజుల పాటు మహోత్సవం
కాళేశ్వరం త్రివేణి సంగమంలో నిర్వహించనున్న సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. గురువారం తెల్లవారుజాము నుంచి మొదలయ్యే పుష్కర మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

దిశ, వరంగల్ బ్యూరో : కాళేశ్వరం త్రివేణి సంగమంలో నిర్వహించనున్న సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. గురువారం తెల్లవారుజాము నుంచి మొదలయ్యే పుష్కర మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. రూ.35 కోట్ల నిధులను కేటాయింపు చేసింది. దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండటం విశేషం. సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు. మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభం కానుంది. గురువారం సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మంత్రి దుద్దిళ్లతో ప్రారంభం... సీఎంతో విగ్రహ ఆవిష్కరణ..!
15వ తేదీ ఉదయం పుష్కరాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుష్కరాలను ప్రారంభించనున్నారని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం కాలేశ్వరం దేవస్థానంలోని కళ్యాణ మండపంలో విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి కేటాయించిన విధుల పట్ల దిశానిర్దేశం చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరణ, పుష్కర స్నానం తదుపరి స్వామి వారి దర్శనం, గోదావరి హారతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారని అనంతరం టెంట్ సిటీ పరిశీలిస్తారని తెలిపారు. కాశీ పండితులతో ప్రత్యేకంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుంభమేళా వెళ్లలేని వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఆ ప్రకారం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులకు స్నానాల షవర్లు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిండ ప్రధాన కార్యక్రమాలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్టాళ్లు, టెంట్ సిటీ, డార్మెటరీ, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులు తు.చ తప్పక విఐపి ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని కంట్రోల్ రూమ్ కి వచ్చిన సమస్యను తక్షణమే ఆయా శాఖల అధికారులు దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాలయంలో భక్తులు క్యూలైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 50 మంది గజ ఈతగాళ్ళు నాటు పడవలతో పహారా కాస్తున్నట్లు తెలిపారు. విధులు నిర్వహించే అధికారులు సిబ్బందిని పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాత్కాలిక బస్టాండ్ నుంచి ఘాట్స్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచితంగా 30 షటిల్ బస్సులు నడుపుతున్నామని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుష్కరవిధులు కేటాయించిన అధికారులకు రెండు షిప్టుల్లో విధులు కేటాయించామని అప్రమత్తంగా ఉండాలని, సమయానికి విధులకు హాజరు కావాలని తెలిపారు. ఎవరైనా గైర్హాజరు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులు కేటాయించిన సిబ్బందికి భోజన, వసతి ఏర్పాటు చేస్తున్నామని సమయ పాలన పాటించాలని సూచించారు. స్విమ్మర్లు లైఫ్ బాయ్స్, జాకెట్స్ ధరించాలని గోదావరిలో ఏ ఒక్కరు మిస్ అయిన విధులకు ఇబ్బంది కలుగుతుందని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలో దేవాదాయశాఖ డైరెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డిఓ రవి అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజా రామయ్యర్
15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. బుధవారం సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతి మాతా విగ్రహం, ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారని, పుష్కర స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారని, అనంతరం త్రివేణి సంగమంలో మొట్ట మొదటి సారిగా కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారని తెలిపారు. మన రాష్ట్రంలో. మొట్ట మొదటిసారిగా పెద్ద ఎత్తున పుష్కరాలు నిర్వహిస్తున్నామని జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులపై గౌరవంగా వ్యవహరించాలని భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఆమె సూచించారు.






