ఇసుక లారీల భీభ‌త్సం.. గాల్లో క‌లుస్తున్న ప్రాణాలు..

by Bhanu |

ములుగు జిల్లాలో ఇసుక లారీలు భీభ‌త్సం సృష్టింస్తున్నాయి. భాద్య‌త లేని ఇసుక లారీల డ్రైవ‌ర్ల రాష్ డ్రైవింగ్‌తో వాహ‌న‌దారుల ప్రాణాల‌కు నూరెళ్లు నిండుతున్నాయి.

ఇసుక లారీల భీభ‌త్సం.. గాల్లో క‌లుస్తున్న ప్రాణాలు..
X

దిశ‌, ఏటూరునాగారం : ములుగు జిల్లాలో ఇసుక లారీలు భీభ‌త్సం సృష్టింస్తున్నాయి. భాద్య‌త లేని ఇసుక లారీల డ్రైవ‌ర్ల రాష్ డ్రైవింగ్‌తో వాహ‌న‌దారుల ప్రాణాల‌కు నూరెళ్లు నిండుతున్నాయి. ఇసుక లారీల మీతిమిరిన వేగం, మద్యం సేవించి లారీలు న‌డ‌పడం, రాష్ డ్రైవింగ్ వంటి కార‌ణాలతో సామాన్య ప్రజ‌లు బ‌ల‌వుతున్న ఘ‌ట‌న‌లు వరుస‌గా నెల‌కొంటున్నాయి. ఇసుక లారీల వ‌ల‌న కీలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంత‌రాయం క‌ల‌గ‌డంతో వాహ‌నదారులు తీవ్ర ఇబ్బందుల‌కు గురవుతున్నారు. ప్ర‌జ‌లకు అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించే అంబులెన్స్‌ల‌కు సైతం లారీ డ్రైవ‌ర్లు దారివ్వ‌క పోవ‌డంతో అంబులెన్సులు ట్రాఫిక్లో చిక్కుకుని లారీ డ్రైవ‌ర్ల‌తో గోడ‌వ‌లు జ‌రుగుతున్న ప‌రిస్థితి నిత్యం పున‌రావృతం అవుతునే ఉంది. సంభందిత శాఖల అధికారులు ఇసుక లారీల పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతోనే ఇలాంటి ఘ‌ట‌న‌లు నెల‌కొంటున్నాయని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వివ‌రాలు ఇలా..ములుగు జిల్లా నూగూరు వెంక‌టాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగ‌పేట మండ‌లాలో ఇసుక రీచ్‌లు కొనసాగుతుండ‌డంతో నిత్యం వంద‌లాది లారీలు ఇసుక లోడింగ్ కోసం జాతీయ ర‌హ‌దారి వెంట‌, ప్రధాన దారుల వెంట అయా మండ‌లాల‌ ఇసుక క్వారీల‌కు చెరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇసుక లారీలు భీభ‌త్సం సృష్టింస్తున్నాయి.

గాలిలో క‌లుస్తున్న ప్రాణాలు..

ఇసుక లారీల డ్రైవ‌ర్ల రాష్ డ్రైవింగ్ తో ప్ర‌జ‌లు, వాహ‌న‌దారులు బెంబెలుత్తుతున్నారు.జాతీయ ర‌హ‌దారి వెంట ప్ర‌యాణం చేయాలంటేనే భ‌యం వేస్తుందని అవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మీతిమిరిన వేగం, ఓవ‌ర్ టెకింగ్‌, మ‌ధ్యం సేవించి లారీలు న‌డ‌ప‌డం వంటి కార‌ణాల‌తో వాహ‌న‌దారులు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు.

రెండు నెల‌ల్లో 3 రోడ్డు ప్ర‌మాదాలు..లారీల‌కు బలైన 3 ప్రాణాలు..మృతి చెందిన వారు ముగ్గురు భ‌క్తులే..

ఇసుక లారీల వ‌ల‌న ములుగు జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట‌ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం, ట్రాఫిక్ అంత‌రాయం క‌ల‌గ‌డం వంటి ఘ‌ట‌న‌లు నెల‌కొంటునే ఉన్నాయి. గ‌డిచిన 2 నెల‌ల్లో ఇసుక లారీల వ‌ల‌న 3 రోడ్డు ప్రమాదాలు జ‌రుగ‌గా ముగ్గురు మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్ర గాయ‌ల‌పాలైయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మేడారం వ‌న‌దేవ‌తల ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తున్న భ‌క్తులే ఇసుక లారీలకు బ‌లైయ్యారు.

రెండు నెల‌ల్లో ఇసుక లారీల వ‌ల‌న జ‌రిగిన‌ ప్ర‌మాదాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1.2025 ఏప్రీల్‌24వ తేదిన మేడారం వ‌న‌దేవ‌తల ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తున్న నూగూరు వెంక‌టాపురం, బ‌ర్ల‌గూడెం గ్రామానికి చెందిన ర‌వి కిర‌న్‌(32), ర‌వి శంకర్‌(35) ద్విచ‌క్ర వాహనం పై వ‌స్తుండ‌గా ఏటూరునాగారం జాతీయ ర‌హ‌దారిపై ఇసుక కోసం వ‌చ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ర‌వి కిర‌ణ్ అక్క‌డికక్క‌డే మృతి చెందగ, ర‌వి శంక‌ర్ కు తీవ్ర గాయ‌లైయ్యాయి. ఈ ప్ర‌మాదం త‌ర్వాత లారీ డ్రైవ‌ర్ లారీని అక్క‌డే వ‌దిలేసి పారిపోయాడు.

2. 2025 మే 2వ తేదీన‌ ఏటూరునాగారం మండ‌లం చిన్న‌బోయిన పల్లి గ్రామ స‌మీపంలో జాతీయ ర‌హ‌దారి పై ఇసుక లారీలు అడ్డుగా ఉండ‌డంతో త‌ప్పించ బోయి అటో, ఆర్టీసీ బ‌స్సు ఒక దానిని ఒక‌టి ఢీ కొట్ట‌కున్నాయి. ఈ ప్ర‌మాదంలో ఒక వ్య‌క్తి కాలు విరిగింది, ఒక మ‌హిళ తీవ్ర గాయాల పాలైయింది. అటోలో ఉన్న మ‌రో ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

3. 2025 మే 18వ తేదిన ఖ‌మ్మం జిల్లాకు చెందిన భ‌క్తులు మేడారం వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నం చేసుకుని తిరిగి వస్తూ తాడ్వాయి గ్రామం వ‌ద్ద ట్రాక్ట‌ర్ నిలిపి ఉంచారు. అతి వేగంతో వెనుక వైపు నుంచి వ‌స్తున్న‌ ఇసుక లారీ అగి ఉన్న‌ ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు మృతి చెంద‌గా 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి.

రోడ్ల పైనే నిలిపివేస్తున్న వైనం..

ములుగు జిల్లాలో కొన‌సాగుతున్న ఇసుక క్వారీల‌కు వ‌స్తున్న లారీలను కీలో మీట‌ర్ల రోడ్ల‌ పైనే నిలిపివేస్తున్నారు. ఫ‌లితంగా కీలోమీట‌ర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ నెల‌కొని వాహ‌నాదారులు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోంటున్నారు. ఇదీలా ఉండ‌గా ప్ర‌జ‌ల‌కు అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించే అంబెలెన్స్‌ల ప‌రిస్థితి వ‌ర్ణ‌ణాతీతంగా మారింది. ఇసుక లారీల‌తో ట్రాఫిక్‌లో చిక్కుకుని అంబులెన్స్ డ్రైవ‌ర్లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇసుక లారీలు అంబులెన్స్ల‌కు దారివ్వ‌క‌పోవ‌డంతో అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌కు లారీల‌ డ్రైవ‌ర్ల‌కు నిత్యం ఘ‌ర్ష‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అర్టీసీ, మిని వాహ‌న‌దారులు, ద్విచ‌క్ర వాహ‌న‌దారులకు సైతం ఇసుక లారీల డ్రైవ‌ర్లతో నిత్యం ఘ‌ర్ష‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

చ‌ర్య‌లు తీసుకోవాలంటున్న ప్ర‌జ‌లు..

ఇసుక లారీల‌పై సంభందిత శాఖల అధికారులు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతోనే ఇసుక లారీ డ్రైవ‌ర్లు ఇష్షానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని ప్ర‌జ‌లు అగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అతి వేగం, మ‌ద్యం సేవించి లారీలు న‌డ‌ప‌డం, ఓవ‌ర్ టెకింగ్ చేస్తున్న ఇసుక లారీల డ్రైవ‌ర్ల‌కు సంభందిత శాఖల అధికారులు శాఖ ప‌ర‌మైన క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకోని గ‌ట్టీ కౌన్సిలింగ్లు నిర్వ‌హిస్తేనే ఇసుక లారీల‌ తీరు మారేను అని ప్ర‌జ‌లు అశా భావం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైన సంభందిత శాఖ అధికారులు ఇసుక లారీల పై చర్య‌లు తీసుకుంటారో లేదో వేచి చూడాలి..?

శివ‌లింగ ప్ర‌సాద్‌, రామ‌న్న‌గూడెం గ్రామం, (అంబులెన్స్ మెడిక‌ల్ టెక్నిషియ‌న్‌).

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో కూడా దారివ్వ‌డం లేదు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని 5 మండ‌లలోని ఏదో ఒక చోట నిత్యం రోడ్డు ప్ర‌మాదాలు, పాము కాటు, తేలు కాటు, పురుగుల మందు తాగ‌డం వంటి ప్ర‌మాదాలు నెల‌కొని అత్య‌వ‌స‌ర సేవ‌లకైయి 108(అంబులెన్స్‌)కి స‌మాచారం వ‌స్తునే ఉంటుంది. ఇలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో కూడా లారీ డ్రైవ‌ర్లు దారి ఇవ్వ‌క‌పోవ‌డం, ప్ర‌దాన దారుల పై లారీలు నిలప‌డం వంటి స‌మ‌స్య‌లు ఏదుర‌వుతూనే ఉన్నాయి. ఇసుక క్వారీలు న‌డిచే చోట రోడ్ల పైనే లారీలు నిలపడంతో మ‌రి ఇబ్బంది నెల‌కొంటుంది. అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలి.

రాధ‌స్వామి నూగురు వెంక‌టాపురం(అంబులెన్స్ డ్రైవ‌ర్‌)

రెండు రోజుల‌ ముందు జ‌రిగిన ఘ‌ట‌న మొర్రివాని గూడెం వే బ్రిడ్జి వ‌ద్ద రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ఇసుక లారీలు రోడ్డు పై నిల‌ప‌డంతో ట్రాఫిక్ జామ్ అయి అంబులెన్స్ ట్రాపిక్‌లో సుమారు 40 నిముషాలు చిక్కుకుంది. అ స‌మయంలో అంబులెన్స్‌లో ఏమ‌ర్జెన్సీ కేసు ఉంది. అలాగే ఏటూరునాగారం అట‌వీ శాఖ చెక్‌పోస్ట్ వద్ద‌, వాజేడు మండ‌లం మండ‌పాక జాతీయ ర‌హ‌దారిపై లారీలు కీలోమీట‌ర్ల మేర నిలిచి ఉంటున్నాయి. అ స‌మ‌యంలో ఏం చేయాలో మాకు అర్ధం కావ‌డం లేదు.. గ‌ట్టీగ మాట్ల‌డితే ఘ‌ర్ష‌న నెల‌కొంటుంది. ఈ స‌మ‌స్య‌కు అధికారులు మార్గం చూపించాలి.


Next Story