రెండేళ్లుగా వడగండ్లతో రైతులకు నష్టాలు : ఎమ్మెల్యే పెద్ది

by Disha Web Desk 20 |
రెండేళ్లుగా వడగండ్లతో రైతులకు నష్టాలు : ఎమ్మెల్యే పెద్ది
X

దిశ, నర్సంపేట : ఈ ఏడాది కురిసిన వడగండ్ల వర్షానికి సంబంధించిన పంట నష్టం వివరాల పై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో సర్వే చేపట్టి నివేదికను తయారు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ కి నివేదికను పంపినట్లు, వచ్చే వారం పంట నష్టపోయిన రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ జీఓ విడుదల కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నర్సంపేట నియోజక వర్గంలోని మండలాల వారీగా పంట నష్టాన్ని గమనిస్తే నర్సంపేట మండలం & మున్సిపాలిటీ పరిధిలో 5300 ఎకరాల్లో పంట నష్టం, నష్టపోయిన రైతుల సంఖ్య 5800 అని తెలిపారు. అదేవిధంగా దుగ్గొండి మండలంలో 10,292 ఎకరాలు, 8374 మంది రైతులు, చెన్నరావుపేట మండలంలో 5604 ఎకరాలు, 5329 మంది రైతులు, ఖానాపురం మండలంలో 6453 ఎకరాలు, 4332 మంది రైతులు, నల్లబెల్లి మండలంలో 3505 ఎకరాలు, 3049 మంది రైతులు, నెక్కొండ మండలంలో 6260 ఎకరాలు, 6205 మంది రైతులు నష్టపోయారన్నారు. నర్సంపేట డివిజన్ లో అన్ని పంటలు కలుపుకొని మొత్తంగా 32,649 మంది రైతులు, 37,498 ఎకరాల పంట నష్టపోయినట్లు తెలిపారు.

2022లో వడగండ్ల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం దాదాపు 50 శాతం పూర్తయిందన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా కేంద్రం పై ఉత్తర యుద్ధం కొనసాగుతుందని ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలు సంతకాలు చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపి ఇప్పటికి 5 సంవత్సరాలు కావొస్తున్న ఇంతవరకు దిక్కు లేదన్నారు. ఈజీఎస్ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ప్రతి రైతు ఆర్థికంగా వృద్ధి చెందుతారని తెలిపారు.



Next Story