అధ్వానంగా రామప్ప ఆలయం..యునెస్కో గుర్తింపు వచ్చినా మారని దుస్థితి

by Dishanational2 |
అధ్వానంగా రామప్ప ఆలయం..యునెస్కో గుర్తింపు వచ్చినా మారని దుస్థితి
X

కాకతీయులు నిర్మించిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయంలో కనీస వసతులు కరువయ్యాయి. 2021 జూలైలో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు లభించింది. అయినా సౌకర్యాల కల్పనలో అధికారులు అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యునెస్కో గుర్తింపు లభించి దాదాపు రెండు సంవత్సరాల పూర్తవుతున్నా ఆలయ పరిసరాల్లో ఎటువంటి మార్పు లేదు. వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశాయి. అనంతరం పోటీపడి మరి అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ పథకాల పేరుతో రూ.కోట్లు కేటాయించి పనులు నిర్వహిస్తామని హామీలు ఇచ్చాయి. దీంతో రామప్ప ఆలయం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ హామీలు మాత్రం అమలుకు నోచుకోలేదు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం ఏ మార్పు లేదని జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ కోసం భారీగా నిధులు కేటాయించినా వాటి నిర్మాణంలో జాప్యం స్పష్టంగా కనబడుతోంది. దీంతో నిత్యం ఆలయ సందర్శణకు వచ్చే పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, ములుగు : కాకతీయులు నిర్మించిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయం జూలై 2021లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందింది. దీంతో రామప్ప ఆలయం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ ఇందుకు భిన్నంగా యునెస్కో గుర్తింపు లభించి దాదాపు రెండు సంవత్సరాల పూర్తవుతున్నా రామప్ప ఆలయ పరిసరాలు ఏమాత్రం మారలేదు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం ఏ మార్పు లేదని జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశాయి. అనంతరం పోటీపడి మరి అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ పథకాల పేరుతో రూ.కోట్లు కేటాయించి పనులు నిర్వహిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ అవి నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ కోసం భారీగా నిధులు కేటాయించినప్పటికీ వాటి నిర్మాణంలో జాప్యం స్పష్టంగా కనబడుతోంది. ఉత్సవాల పేరుతో ప్రముఖులు ఆలయ సందర్శనకు వచ్చే ముందు నిర్మాణాలను మొదలుపెట్టినట్టు మొదలుపెట్టి తర్వాత గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్త అవుతున్నాయి.

మౌలిక వసతులు కరువు..

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర ఆలయాన్ని వీక్షించడానికి వస్తున్న సందర్శకులు రామప్ప ఆలయ చుట్టుపక్కల సందర్శకుల కోసం కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అందుబాటులో కనీసం తాగునీరు ఏర్పాటు చేయకపోవడం, వేసవిలో ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం కాళ్లు కాలకుండా మ్యాట్లు ఏర్పాటు చేయలేదు. దీంతో మండుటెండలో ఆలయ పరిసరాల్లో ఎండవేడికి చెప్పులు లేకుండా నడిచే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలంలో మరుగుదొడ్లు, మంచినీటి వసతి లేకపోవడంతో సందర్శకులు ఒకింత అసహనానికి గురవుతున్నారు. యునెస్కో గుర్తింపు తర్వాత రామప్ప ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైనా వారికి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.

అంటి ముట్టనట్టు పురావస్తు శాఖ..

యునెస్కో గుర్తింపు అనంతరం రామప్ప ఆలయ పక్కన శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించాల్సి ఉండగా వాటిపై ఇంకా పురావస్తు శాఖ దృష్టి సారించలేదు. ఆలయం ముందు భాగంలో కొంతమేర ప్రహరీ నిర్మించి పురావస్తు శాఖ అధికారులు చేతులు దులుపుకున్నారు. స్వయాన రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన ప్రసాద్ స్కీంకు సంబంధించిన అభివృద్ధి పనులు ఇంకా మొదలు కాకపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. పురావస్తుశాఖ చిన్నపాటి ప్రహరీ నిర్మించి చేతులు దులుపుకున్నారని పర్యాటకుల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కనీస వసతులు కరువు..

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. మంచినీటి వసతి, ఆలయ పరిసరాల్లో ఎండ వేడి తగ్గించడానికి ఏర్పాట్లు ఏవి చేయకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ గుర్తింపు పొందిన రామప్పలో ఇటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోలేదు. అధికారులు ఉత్సవాల పేరుతో పెట్టే ఖర్చులో కొంతమేర వసతుల కల్పన కోసం ఖర్చు చేస్తే బాగుండేది.

- నాగనాథ్, పర్యాటకుడు, హైదరాబాద్



Next Story

Most Viewed