రామప్పకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై కలెక్టర్ సీరియస్ ఫోకస్

by Disha Web Desk 19 |
రామప్పకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై కలెక్టర్ సీరియస్ ఫోకస్
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్, ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఆర్ఓ రమాదేవిలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రఖ్యాత రామప్ప దేవాలయంను సందర్శించనున్న నేపథ్యంలో.. ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రామప్పలో మూడు హెలిప్యాడ్‌లు సిద్ధం చేయాలని, చెట్లు తొలగించాలని, మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయాలని సంబంధిత అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. పార్కింగ్ ఏరియాలో బార్కెడ్‌లు ఏర్పాటు చేయాలని, భైరవ దేవాలయం, ఉపాలయాలు గర్భగుడి, సుందరీకరణతో విద్యుత్ కాంతులతో అలంకరణలు చేయాలని సూచించారు.

ఆలయ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా శానిటైజేషన్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. రాష్టప్రతి పర్యటన ఏర్పాట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య.. ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్పీతో చర్చించారు. ఈ సమావేశంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కో ఆర్డినేటర్ పాండురంగారావు, కలెక్టరేట్ ఏవో విజయభాస్కర్, ఏడీ,హెరిటేజ్ మల్లు నాయక్, పర్యాటక శాఖ అధికారి శివాజీ, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ ప్రసన్నారాణి, తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, మంజుల సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed