కాంగ్రెస్ హయాంలో ప్రధానిపైన మరో సూపర్ పవర్

by Dishaweb |
కాంగ్రెస్ హయాంలో ప్రధానిపైన మరో సూపర్ పవర్
X

అజ్మీర్ (రాజస్థాన్) : కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రిపైన కూడా మరో సూపర్ పవర్ ఉండేదని విమర్శించారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచేదని ఆరోపించారు. మనదేశ బార్డర్ లో రోడ్లు వేయడానికి కూడా కాంగ్రెస్ సర్కారు భయపడేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఒక్క ఓటుతో 2014లో దేశ ప్రజలు అన్నింటినీ మార్చేశారని చెప్పారు. రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలను తప్పుదోవ పట్టించడం, వాళ్ళను బాధల్లోకి నెట్టేయడం అనే పాలసీని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోందన్నారు.

"వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పేరుతో మన మాజీ సైనికులకు కూడా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేయడమే కాకుండా మాజీ సైనికులకు ఏరియర్స్ కూడా ఇచ్చింది. " అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "2014కు ముందు దేశ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేవారు. తీవ్రవాద దాడులు జరుగుతుండేవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడుతోంది" అని ఆయన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు తొమ్మిదేళ్లుగా అంకితభావంతో ప్రజాసేవ చేస్తోందన్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో గత ఎనిమిది నెలల్లో రాజస్థాన్‌లో ప్రధాని మోడీ పర్యటించడం ఇది ఆరోసారి.


Next Story

Most Viewed