క‌డియం అవినీతి తిమింగ‌ళం..!

by Disha Web Desk 20 |
క‌డియం అవినీతి తిమింగ‌ళం..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి ఓ అవినీతి తిమింగ‌లమ‌ని, ఆయ‌న అవినీతి, అక్ర‌మాల చ‌రిత్రంతా త‌న‌కు తెలుస‌ని, అస‌ర‌మైన‌ప్పుడు ఆ పుస్త‌కాన్ని తెరుస్తానంటూ ఎమ్మెల్యే రాజ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తానో నీతిమంతుడునంటూ ప్ర‌చారం చేసుకుంటున్న క‌డియం అక్ర‌మాల గురించి, ఆయ‌న ఎంత సంపాదించింది, మ‌లేషియాలో, సింగ‌పూర్‌లో దాచుకున్న‌దంతా త‌న‌కు తెలుసని అన్నారు. క‌డియం ఎమ్మెల్యే కాక‌ముందే త‌న ఇంటికి గోనె సంచులు క‌ట్టుకున్నాడ‌ని, మ‌రి త‌న‌కు తాను నీతి మంతుడుగా చెప్పుకుంటున్న క‌డియం కోట్ల సంపాద ఎలా వ‌చ్చింది. ఇప్పుడు బంగ్లాలు ఎక్కడివంటూ ప్ర‌శ్నించారు. నీతిమంతుండని మాట్లాడుతున్నావు నేతి బీరకాయలో నేతి ఎంతుంటుందో నువ్వు గంతేనంటూ ఎద్దేవా చేశారు. జ‌న‌గామ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జ‌ఫ‌ర్‌గ‌డ్ మండ‌లం హిమ్మ‌త్‌న‌గ‌ర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో పాల్గొని మాట్లాడారు.

క‌డియం శ్రీహ‌రిని ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌న తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేశారు. క‌డియం శ్రీహ‌రి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రిగా ఉన్న‌ప్ప‌టి నుంచి ఏయేం అక్ర‌మాలు చేశారో అన్నీ నాకు తెలుసు నా దగ్గర ఒక పుస్తకం ఉందని హెచ్చ‌రించారు. అవసరం వచ్చినప్పుడు ఆ పుస్తకం బయటపెట్టి నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో బయట పెడతానంటూ చెప్ప‌డం గ‌మ‌నార్హం. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఘనపూర్ నియోజకవర్గానికి కుదవబెట్టి సింగపూర్ మలేషియాలో ఆస్తులు సంపాదించావంటూ ఆరోపించారు. ఖానాపూర్ నడిబొడ్డున నేను పుట్టాను నా అడ్డా గడ్డ గణపురమేనంటూ ఉద్ఘాటించారు. 2014, 2018 ఎన్నికల కోసం నా ఆస్తులన్నీ అమ్ముకున్నా, రాజకీయాల్లోకి రాక ముందు నాకు 40 ఎక‌రాల భూమి, నాలుగు కార్లు ఉండేవి, రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఆస్తులు అమ్ముకున్న చరిత్ర నాది.. ఆస్తులు కొనుక్కున్న చరిత్ర నీదంటూ క‌డియంపై ధ్వ‌జ‌మెత్తారు. నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ ఆరుద్ర పురుగు లాగా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. మండ‌లానికో రూ.10ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారంట‌. ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయి.. డ‌బ్బులు, ఇదంతా అవినీతి, అక్ర‌మంగా సంపాదించింది కాదా..? అంటూ క‌డియంను ఉద్దేశించి విమ‌ర్శించారు.

చాటుకు కాదు.. ర‌చ్చ‌బండ ద‌గ్గ‌ర‌కు రా చూసుకుందా..!

ఎప్పుడు రానిది మళ్లీ మీ ముందుకు ఊసరవెల్లి రంగులు మారినట్టు వస్తున్నారంటూ ప్ర‌జ‌లను ఉద్దేశించి అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ దొంగ సాటు మీటింగులు ఎందుకు పెడుతున్నావు?, నువ్వు నిజమైన బీఆర్ఎస్ నాయకుడివైతే రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టు ..నువ్వు నేను చూసుకుందామంటూ స‌వాల్ క‌డియంకు రాజ‌య్య స‌వాల్ విసిరారు. పార్టీ నుంచి బహిష్కరించబడిన వారు, పార్టీ పైనా అసంతృప్తులుగా ఉన్నా వాళ్లే నీతో ఉంటున్నారన్నారు. ఈ రోజు నుంచి ఎన్నికల వరకు ప్రతిరోజు తిరుగుతా, ప్రతి ఊరిలో డప్పు కొడుతా, పైసలిచ్చి గెలిచే రోజులు పోయినాయి. నియోజకవర్గంలో నాలాగా ఉరకాలంటే నీ గుండె ఆగిపోతుందంటూ ఆవేశంగా మాట్లాడారు. ప్రతిపక్షాల పప్పులు ఉడకకుండా చేయ‌డంలో కేసీఆర్ మొండి, కేసీఆర్‌ను మించిన జ‌గ‌మొండిని నేను అంటూ ధ్వ‌జ‌మెత్తారు.



Next Story

Most Viewed